వేంపల్లె : వేంపల్లెలోని స్థానిక గండి రోడ్డులో సిమెంట్ బ్రిక్స్లో పనిచేసే ఒక మహిళపై అత్యాచారంయత్నానికి పాల్పడిన షేక్ ఇజయతుల్లాపై కేసు నమోదు చేసినట్లు సీఐ నరసింహులు తెలిపారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఒరిస్సా రాష్ట్రం బర్కత్ బట్టి జిల్లాకు చెందిన మహిళ వేంపల్లె గండి రోడ్డులో ఉన్న స్టార్ సిమెంట్ బ్రిక్స్ ఫ్యాక్టరీలో పని చేస్తూ ఉండేది. ఈ నెల 26వ తేదీన ఆ మహిళపై బ్రిక్స్ ఫ్యాక్టరీ మేనేజర్ షేక్ ఇజయతుల్లా అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఆమె పక్కకు వెళ్లి తప్పించుకుని వెంటనే ఆమె భర్తకు విషయం తెలపగా.. ఢిల్లీ హ్యూమన్ రైట్స్కు ఫిర్యాదు చేశాడు. వారు కడప ఎస్పీకి సమాచారమివ్వడంతో వేంపల్లె సీఐ నరసింహులు విచారించి వారిపై కేసు నమోదు చేశారు.
చోరీ కేసులో
నిందితుడు అరెస్టు
వేంపల్లె : వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన మలిరెడ్డి జయప్రకాష్ రెడ్డి అనే నిందితుడిని అరెస్టు చేసినట్లు సీఐ నరసింహులు తెలిపారు. సోమవారం వేంపల్లెలోని స్థానిక పోలీస్స్టేషన్లో నిందితుడిని విలేకరుల ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో పగలు, రాత్రి పూట వేంపల్లె పంచాయతీ పరిధిలోని నాయీ బ్రాహ్మణ వీధిలోని టెంకాయ చెట్టు ఎదురుగా ఉన్న చక్రాయపేట ఎంపీపీ బాలకృష్ణ ఇంట్లో చోరీ చేసిన సంఘటనలో బంగారు, వెండి, రెడ్డినగర్లోని లక్ష్మీదేవి ఇంట్లో, పులివెందుల రోడ్డులోని తేజా శారీస్ సెంటర్లో చీరలు, లక్ష్మి హెయిర్ స్టైల్లో టీవీని పులివెందులలోని కొండారెడ్డి కాలనీకీ చెందిన మలిరెడ్డి జయ ప్రకాష్ రెడ్డి దొంగలించినట్లు తెలిపారు. పులివెందుల డీఎస్పీ మురళి నాయక్ పర్యవేక్షణలో సీఐ నరసింహులు, ఎస్ఐ తిరుపాల్ నాయక్ల ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఎన్టీఆర్ సర్కిల్లో నిందితుడిని అరెస్టు చేశారు.అతని వద్ద నుంచి 8గ్రాముల బంగారు కమ్మలు, రెండు వెండి గ్లాసులు, వెండి దీపాలను, 40 చీరలు, టీవీని స్వాధీనం చేసుకున్నారు.అలాగే బైకును కూడా సీజ్ చేసినట్లు తెలిపారు చోరీ కేసును త్వరగా చేధించిన హెడ్ కానిస్టేబుల్ వేణుగోపాల్ రెడ్డి, కానిస్టేబుల్ శివ చైతన్య, ఆలీ, కిరణ్లను సీఐ నరసింహులు అభినందించారు.


