నిధులిచ్చిన ఎంపీ, కూటమి మోకాలడ్డు
● ఎంపీ మిథున్రెడ్డి కృషితోమదనపల్లెకు కేంద్రీయ విద్య
● ప్రిన్సిపాల్ను నియమించిన కేంద్రం
● 2026–27 ఏడాది నుంచే తరగతులు
మదన పల్లె కేంద్రీయ విద్యాలయానికి కేంద్రప్రభుత్వం ప్రిన్సిపాల్ను నియమించింది. కర్నూలు కేంద్రీయ విద్యాలయంలో హెడ్మాస్టర్గా పనిచేస్తున్న తమ్మిశెట్టి వెంకటేశ్వర్లను ఇన్చార్జ్ ప్రిన్సిపాల్గా నియమిస్తూ ఉత్తర్వు జారీ చేయడంతో శుక్రవారం ఆయన ఇక్కడ బాధ్యతలను స్వీకరించి కార్యకలాపాలను ప్రారంభించారు.
మదనపల్లె: మదనపల్లెను విద్యా కేంద్రంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక విద్యా కేంద్రం..కేంద్రీయ విద్యాలయం ద్వారా పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలన్న రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిథున్రెడ్డి లక్ష్యం నెరవేరుతోంది. కేంద్రంపై ఒత్తిడితో ఆయన మంజూరు చేయించిన కేంద్రీయ విద్యాలయం తరగతుల ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈ మేరకు కేంద్రం చర్యలు తీసుకుంటూ ఈ విద్యా కేంద్రానికి ప్రిన్సిపాల్ను నియమిస్తూ చర్యలు తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం 2026–27 నుంచే తరగతులను ప్రారంభించేందుకు నిర్ణయించగా దరఖాస్తులను ఆహ్వనిస్తూ ప్రకటన జారీ చేశారు. కూటమిప్రభుత్వం మోకాలడ్డినా కేంద్రప్రభుత్వంతో ఎంపీ నిత్యం సంప్రదిస్తూ మదనపల్లె ప్రతిష్టను ఇనుమడింపజేశారని ప్రజలు కొనియాడుతున్నారు.
ఎస్టీ హస్టల్లో తరగతులు
మదనపల్లెలోని నీటిపారుదలశాఖ ఆవరణలో నిర్మించిన గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల (బాలురు)ను కేంద్రీయ విద్యాలయం మార్చారు. గత ఏడాదే తరగతుల నిర్వహణకు అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రస్తుతం తరగతుల నిర్వహణకు భవనం సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఒకటి నుంచి ఐదో తరగతి వరకు తరగతులను నిర్వహించి వచ్చే 2027–28 ఏడాదిలో తరగతుల సంఖ్యను పెంచనున్నారు. ప్రతి తరగతిని 40 సీట్లు ఉంటాయి. వీటిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన కేటగిరీ ఫోర్ ఉద్యోగుల పిల్లలకు సీట్ల కేటాయింపు ఉంటుంది. ఈ సీట్లకు కేంద్రప్రభుత్వ ఉద్యోగులు లేకుండా రాష్ట్రప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు అవకాశం ఉంటుంది. వీరితోపాటు సాధారణ పిల్లలకు సీట్లు కేటాయిస్తారు. ఇందులో ఎస్సీలకు 15శాతం, ఎస్టీలకు 7.5శాతం, ఓబీసీలకు 27శాతం రిజర్వేషన్ ఉంటుంది.
దరఖాస్తుల ఆహ్వనం
కేంద్రీయ విద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభించారు. 1వ తరగతి అడ్మిషన్లకు దరఖాస్తులు మార్చి 20 నుంచి ఏప్రిల్ 2 వరకు ఆన్లైన్లో ద్వారా మాత్రమే స్వీకరిస్తారు. 2వ తరగతి నుంచి 5వ తరగతి వరకు దరఖాస్తులు విద్యాలయ కార్యాలయంలో అందుబాటులో ఉంటాయి. మొదటి తరగతికి దరఖాస్తు చేసుకునే విద్యార్థుల వయస్సు 31–03–2026 నాటికి కనీసం 6 సంవత్సరాలు పూర్తయి ఉండాలి. అన్ని అడ్మిషన్లు కేంద్రీయ విద్యాలయ సంఘటన్ మార్గదర్శకాల ప్రకారం నిర్వహిస్తారు. అడ్మిషన్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలే కాకుండా ఇతరులు కూడా ఆన్లైన్లో అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో అందిన దరఖాస్తులపై ఏప్రిల్ 19న పది గంటలకు 2 నుంచి ఐదో తరగతి విద్యార్థులకు సీట్ల కేటాయింపుకు లాటరీ పద్దతిలో ఎంపిక జరుగుతుంది.
మదనపల్లెలో 2025–26 విద్యా సంవత్సరంలో కేంద్రీయ విద్యాలయ తరగతులను ప్రారంభించేలా స్థానిక ఎస్టీ హస్టల్ బాలుర భవనాన్ని సిద్ధం చేశారు. విద్యార్థుల తరగతుల నిర్వహణ, మౌలిక వసతుల కల్పన కోసం చర్యలు తీసుకున్నారు. త్వరితగతిన తరగతులు ప్రారంభం అయ్యేందుకు ఎంపీ మిథున్రెడ్డి ఎంపీల్యాడ్స్ నుంచి రూ.40 లక్షల నిధులు మంజూరు చేశారు. ఈ నిధులతో హస్టల్ భవనంపైన భవనాల నిర్మాణం, బాల, బాలికలకు వేర్వేరు మరుగుదొడ్లను నిర్మించారు. అయితే తరగతులను ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం ఆసక్తి చూపలేదు. అధికారులు, కేంద్రం సిద్ధంగా ఉన్నామని చెప్పినా పట్టించుకోలేదు. దీనిపై వైఎస్సార్సీపీ లోక్సభాపక్షనేత, రాజంపేట ఎంపి పీవీ.మిథున్రెడ్డి పలుమార్లు కేంద్రమంత్రిని కలిసి విన్నవిస్తూనే ఒత్తిడి తెచ్చారు. ఫలితంగా మాకు కేటాయించిన 6.09 ఎకరాల భూమిని అప్పగించండి అంటూ అన్నమయ్యజిల్లా కలెక్టర్, ప్రభుత్వానికి కేంద్రం లేఖలు రాసింది. గత డిసెంబర్ 3న మిథున్రెడ్డి మళ్లి కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను కలిసి వినతిపత్రం అందించారు. ఇక్కడి పరిస్థితులు, తక్షణమే విద్యాలయం ప్రారంభించాల్సిన ఆవశ్యకతను వివరించారు. దీంతో కేంద్రం స్పందించి తరగతుల ప్రారంభానికి సిద్ధంమైంది.


