రాజంపేట: పదకవితాపితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు నడిచిన కాలిబాటలో నడిచి వెళ్లి..ఆ కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకునే భాగ్యం ఈ సారైనా వేలాదిమంది భక్తులకు కల్పించాలని రాజంపేట శాసనసభ్యుడు, వైఎస్సార్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి పేర్కొన్నారు. కడప–రేణిగుంట జాతీయరహదారిలోని అన్నమయ్య ఉద్యానవనం లో టీటీడీ, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తాళ్లపాక అన్నమాచార్యుల 523 వర్ధంతి ముగింపు ఉత్సవాల్లో పాల్గొన్నారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది అన్నమయ్య కాలిబాటలో వేలాది మంది భక్తులు తిరుమల మహాపాదయాత్ర చేపట్టాలని సిద్ధమయ్యారన్నారు. అయితే చివరి క్షణంలో అన్నమయ్య కాలిబాటలో యాత్రగా వెళ్లకూడదని అటవీశాఖ ఆంక్షలు పెట్టిందన్నారు. దీంతో అనేకమంది శ్రీవారిభక్తుల మనోభావాలకు దెబ్బతగిలిందన్నారు. అన్నమయ్య కాలిబాటలో ప్రతి ఏటా నడిచివెళ్లేవారమని, గత ఏడాది పోలేకపోయామని భక్తులు మనోవేదనకు గురయ్యారన్నారు. ఇలాంటి విధానం పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం, అటవీశాఖ చూడాలన్నారు. ఎమ్మెల్యేతోపాటు వైఎస్సార్సీపీ స్టేట్కౌన్సిల్సభ్యుడు చొప్పా ఎల్లారెడ్డి, తాళ్లపాకకు చెందిన జువ్వాది మోహన్,జవ్వాది సుదర్శన్, నియోజకవర్గ చేనేత అధ్యక్షుడు శివయ్య, రామయ్య, మాజీ ఎంపీటీసీ రెడ్డయ్య, తాళ్లపాక నేత అజయ్వర్మ, ఊటుకూరు మల్లికార్జునరాజు, కళ్యాణ్,సూరి,జై.ప్రకాశ్వర్మ, రంగస్ధల కళాకారుడు జబ్బిరెడ్డి వెంకటరెడ్డి, కళాకారులు, రంగస్ధల నటులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే ఆకేపాటి, చొప్పాఎల్లారెడ్డిని తాళ్లపాక గ్రామస్తులు జవ్వాది మోహన్, జవ్వాది సుదర్శన్, అజయ్వర్మలు సన్మానించారు.
● టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో అన్నమాచార్యుని వర్ధంతి సందర్భంగా నిర్వహించిన సంగీతసభలు, హరికథలు భక్తులను అలరించాయి. శనివారం తిరుపతికి చెందిన వేణుగోపాల్, కోమల బృందం సంగీతసభ, తిరుపతికి చెందిన అనుసూయ బృందం హరికథ నిర్వహించారు.
రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి


