అలసత్వం వహిస్తే చర్యలు
● రేపటి నుంచి ఇంటర్ వ్యాల్యుయేషన్ ప్రారంభం
● కడప ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఏర్పాట్లు
● రెండు విడతల్లో స్పాట్ పక్రియ
కడప ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకనం(స్పాట్ వ్యాల్యుయేషన్) ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ ప్రక్రియ ఆదివారం నుంచి కడపలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల వేదికగా మొదలవ్వనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఇంటర్ అధికారులు పూర్తి చేశారు. ప్రధాన ద్వారంతోపాటు మూల్యాంకనం జరగుతున్న అన్ని గదుల్లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలను ఆన్లైన్ స్ట్రీమింగ్ చేశారు. దిద్దుబాటులో జరిగే తప్పులు, దోషాలకు ఎగ్జామినర్లు, సిబ్బంది బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని ఇంటర్ అధికారులు తెలిపారు. కావున అన్ని జాగ్రత్తలు తీసుకుని మూల్యాంకనం చేయాలని అధికారులు సూచించారు.
1,94,932 పేపర్లకు మూల్యాంకనం
ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరానికి సంబంధించిన మూల్యాంకనం కోసం 1,94,932 జవాబు పత్రాలు జిల్లాకు రావాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 1,66,362 పేపర్లు జిల్లాకు చేరుకున్నాయి. వీటిలో 1,61,841లకు కోడింగ్ పూర్తి చేశారు. మిగతా వాటికి కోడింగ్ చేస్తున్నారు. జవాబు పత్రాల మూల్యాంకనం మొత్తం రెండు విడతల్లో జరగనుంది. ఇందుకు సంబంధించి ఉదయం, సాయంత్రం రెండు విడతల్లో మూల్యాంకనం జరగనుంది. మొదటి విడత ఉదయం 10 నుంచి 1 గంట వరకు, 2వ విడత మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు జరగనుంది. ఇందులో ఒక ఎగ్జామినర్ పూటకు 15 చొప్పున రోజుకు 30 పేపర్లను దిద్దాల్సి ఉంటుంది. ఈ మూల్యాంకనం కోసం 810 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు, 106 మంది చీఫ్ ఎగ్జామినర్లు, 83 స్క్రూటిని నైజర్స్, 15 మంది ఏసీఓలను నియమించినట్లు ఆర్ఐవో తెలిపారు.
సిబ్బంది నియామకం పూర్తి
మూల్యాంకన విధుల కోసం ఎగ్జామినర్ల నియామక ఉత్తర్వులను ఇంటర్మీడియట్ బోర్డు ఇప్పటికే ఆయా కళాశాలలకు చేరవేసింది. పేపర్ వ్యాల్యుయేషన్ ప్రక్రియలో భాగంగా స్పాట్ క్యాంపు ఆఫీసర్గా ఆర్ఐవో వెంకటేశ్వర్లు వ్యవహరిస్తారు. జనరల్–1, జనరల్–2, సీసీఓ–1, సీసీఓ–2గా పలు ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాల్స్, లెక్చరర్లు వ్యవహరిస్తారు. వీరితోపాటు కోడింగ్ ఆఫీసర్లు, ఏసీవోలు, సబ్జెక్టు ఎక్స్ఫర్ట్, చీఫ్ ఎగ్జామినర్లు, అసిస్టెంట్లు ఎగ్జామినర్లు, స్క్రూటిని నైజర్ల నియామక ప్రక్రియ పూర్తయింది. ఇందుకు సంబంధించిన నియామక ఉత్తర్వులు సైతం ఆయా కళాశాలలకు చేరాయి.
మూల్యాంకన షెడ్యూల్ ఇలా...
విడత మొదలయ్యే తేదీ దిద్దనున్న సబ్జెక్టు వివరాలు
మొదటి మార్చి 22 నుంచి తెలుగు, హిందీ, ఇంగ్లిష్,
హిస్టరీ, ఎకనామిక్స్, గణితం
రెండవ మార్చి 25 నుంచి బాటనీ, జువాలజీ, కామర్స్,
ఫిజిక్స్, సివిక్స్, కెమిస్ట్రీ
జిల్లాలో 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్న మూల్యాంకన విధులకు కేటాయించిన సిబ్బంది తప్పక హాజరు కావాలి. విధులకు కేటాయించిన లెక్చరర్లను ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్ రిలీవ్ చేసి మూల్యాంకన విధులకు పంపాలి. మూల్యాంకన కేంద్రంలోకి సెల్ఫోన్ను అనుమతించడం జరగదు. మూల్యాంకన కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి స్ట్రీనింగ్ చేయించాం. పేపర్ల దిద్దుబాటులో అలసత్వం ప్రదర్శించి తప్పులు చేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎంతటి వారికై నా చర్యలు ఉంటాయి. – వెంకటేశ్వర్లు, ఆర్ఐవో, ఇంటర్ స్పాట్ క్యాంప్ ఆఫీసర్


