● నీకు ఏ అర్హత ఉందని
చర్చకు సిద్ధమా అంటున్నావు
● ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు
● బీటెక్ రవిపై
వైఎస్సార్సీపీ నాయకుల ధ్వజం
పులివెందుల రూరల్ : బీటెక్ రవి వివేకా హత్య కేసు లేకుంటే నీకు మీ పార్టీలో మనుగడ ఉండదని, నీకు ఏ అర్హత ఉందని చర్చకు సిద్ధమా అంటున్నావని, ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి గురించి మాట్లాడే అర్హత నీకు లేదని మున్సిపల్ మాజీ చైర్మన్ వరప్రసాద్, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ చిన్నప్ప, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు హాల్ గంగాధర్రెడ్డి, వైఎస్సార్సీపీ పట్టణ ఉపాధ్యక్షుడు పార్నపల్లె కిశోర్, స్టేట్ జాయింట్ సెక్రటరీ డేరంగుల చంద్రమౌళి, మాజీ వైస్ చైర్మన్ హఫీజ్ పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని భాకరాపురంలో ఉన్న వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. బీటెక్ రవి నీ మనుగడ కాపాడుకునేందుకే సునీత వెనుకాలే తిరుగుతూ, అనవసర విషయాల్లో జోక్యం చేసుకుంటూ పబ్బం గడుపుతున్నావన్నారు. ఏ సెక్షన్ ఎవ్వరికీ పెట్టాలో, ఎవ్వరికి ఏ శిక్ష వేయాలో చెప్పడానికి నువ్వు, సునీతమ్మ మీరే జడ్జిలుగా వ్యవహరించితే ఇక సుప్రీంకోర్టులు ఎందుకు, సీబీఐ ఎందుకు అని ప్రశ్నించారు. నెలకొకసారి పులివెందుల రావడం, వివేకా హత్య కేసు గురించి మాట్లాడటం మళ్లీ అదృశ్యమవ్వడం తప్ప ఈ రెండేళ్లలో ప్రజలకు చేసింది శూన్యమన్నారు. ఏ అర్హత ఉందని ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిని చర్చకు సిద్ధమా అని అడుగుతున్నావు అన్నారు. ఊర్లో పెళ్లికి ఎవరెవరో హడావుడి అన్నట్లు నీ గోల ఏంటో ఎవ్వరికీ అర్థం కావడం లేదన్నారు. ప్రపంచంలోనే ఇదొక వింత, చంపినోడికి ఒకడే లాయర్, సునీతమ్మకు ఒక్కడే లాయర్, ఆదుకుంటున్న చంద్రబాబుకు ఒక్కడే లాయర్, ఇంత వింత గురించి మాట్లాడే నీకు అవార్డులు ఇవ్వాలన్నారు. జిల్లాలో వైఎస్ అవినాష్రెడ్డి క్రేజ్ ముందు నీ కుప్పిగంతులు బలాదూర్ అన్నారు. ఎన్ని చారలు పెట్టుకున్నా పిల్లి పులి అవ్వదు, వైఎస్ అవినాష్రెడ్డికి మీరు సరితూగరన్నారు. వైఎస్ అవినాష్రెడ్డి ఏ తప్పు చేయలేదు, ధర్మం ఉంది కాబట్టే అటు రాష్ట్రంలో, ఇటు కేంద్రంలో కీలకంగా ఉన్న చంద్రబాబు, సిద్ధార్థ లూథ్రా, సీబీఐ అంతా ఏకమైనా సుప్రీం కోర్టులో అన్ని పిటిషన్లు వీగిపోయాయని, న్యాయం గెలిచింది, గెలుస్తుందన్నారు. నీచ రాజకీయాల కోసం నీ లాంటి వారంతా వైఎస్ కుటుంబీకుల పంచన చేరి షర్మిల, సునీత, చంద్రబాబు, నువ్వు, ఆదినారాయణరెడ్డి, వాసు అంత మంది కలిసి వైఎస్ అవినాష్రెడ్డిపై బురద చల్లినా, ఈవీఎం ట్యాంపర్ చేసినా ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి గెలుపును అడ్డుకోలేకపోయారన్నారు. బురదజల్లే మాటలు మానుకొని పులివెందులను అభివృద్ధికి తోడ్పడాలన్నారు. కార్యక్రమంలో మాజీ కో ఆప్షన్ మెంబర్ దాసరి చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.


