నేడు పులివెందులకు వైఎస్ జగన్ రాక
పులివెందులలో మూడు రోజులు పర్యటించనున్న మాజీ సీఎం
నేడు మధ్యాహ్నం ప్రజలతో మమేకం కానున్న వైఎస్ జగన్
26న బ్రాహ్మణపల్లెలో అరటి పంటల పరిశీలన
పులివెందుల : వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం నుంచి మూడు రోజులపాటు పులివెందులలో పర్య టించనున్నారు. ఈనెల 25వ తేదీన మధ్యాహ్నం 3గంటలకు బెంగుళూరు నుంచి హెలీకాప్టర్లో పులివెందులకు బయలుదేరుతారు. 3.50గంటలకు పులివెందులలోని భాకరాపురం హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా భాకరాపురంలోని తన క్యాంపు ఆఫీస్కు చేరుకుంటారు. 4గంటల నుంచి 7గంటల వరకు క్యాంపు ఆఫీస్లో ప్రజలతో మమేకం కానున్నారు. అనంతరం భాకరాపురంలోని తన స్వగృహానికి వెళ్లి.. రాత్రికి అక్కడే బస చేస్తారు.
రెండో రోజు ఇలా... 26వ తేదీ ఉదయం 8.45గంటలకు తన నివాసం నుంచి బయలుదేరి పట్టణంలోని స్థానిక వాసవీ ఫంక్షన్ వద్దకు చేరుకుంటారు. అక్కడ జరిగే ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొంటారు. 9.20గంటలకు అక్కడి నుంచి రోడ్డు మార్గాన బ్రాహ్మణపల్లె గ్రామానికి బయలుదేరుతారు. 10గంటలకు బ్రాహ్మణపల్లె గ్రామ సమీపంలోని అరటి తోటల వద్దకు చేరుకుని.. అరటి తోటలను పరిశీలిస్తారు. అక్కడి రైతులతో మాట్లాడనున్నారు. అనంతరం 10.45కి అక్కడి నుంచి బయలుదేరి ఇటీవల చనిపోయిన లింగాల మాజీ సర్పంచ్ మహేష్రెడ్డి ఇంటికి చేరుకుంటారు. 11.50గంటల వరకు అక్కడే ఉండి మహేష్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. 12.30గంటలకు పులివెందులలోని భాకరాపురంలోని తన నివాసానికి చేరుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 2గంటలకు తన నివాసం నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి వేముల మండలం వేల్పుల గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ మండల పరిశీలకుడు లింగాల రామలింగారెడ్డి ఇంటికి చేరుకుంటారు. 2.50గంటలకు వేల్పుల లింగాల రామలింగారెడ్డి ఇంటి నుంచి బయలుదేరి భాకరాపురంలోని క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. సాయంత్రం 4గంటల నుంచి 7గంటల వరకు తన క్యాంపు కార్యాలయంలో ప్రజలతో మమేకమవుతారు. అనంతరం తన నివాసానికి చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు.
మూడో రోజు ఇలా..
27వ తేదీ గురువారం ఉదయం 7.45గంటలకు భాకరాపురంలోని తన నివాసం నుంచి హెలీప్యాడ్ వద్దకు బయలుదేరుతారు. 8గంటలకు హెలీకాప్టర్ ద్వారా తిరుగుపయనమవుతారు.


