
ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థికి గోల్డ్ మెడల్
కడప ఎడ్యుకేషన్ : కడప ప్రభుత్వ పురుషుల కళాశాల(స్వయం ప్రతిపత్తి)లోని అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ విద్యార్థిని అంకాల శైలజ (ఎం.కామ్ 2022–24 బ్యాచ్) గోల్డ్ మెడల్ సాధించారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా ఆమె ఈ పురస్కారం అందుకున్నారు. కడప ప్రభుత్వ పురుషుల కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి.రవీంద్రనాథ్, అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ కోఆర్డినేటర్ బయ్యపురెడ్డి విద్యార్థిని ప్రతిభను అభినందించారు.
బస్సు డ్రైవర్పై దాడి
దువ్వూరు : ఆళ్లగడ్డ–మైదుకూరు మధ్య తిరుగుతున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్పై ప్రయాణికుడు దాడి చేశాడు. పోలీసుల వివరాల మేరకు.. ఆళ్లగడ్డ – మైదుకూరు మధ్య నడుస్తున్న ఆర్టీసీ హయర్ బస్సులో దువ్వూరులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రయాణికులు ఎక్కారు. అందులో ఒకాయనకు కంటిచూపు లేదు.. బస్సు ఎక్కేలోపే బస్సును కదిలించావు. బస్సు ఎలా నడపాలో తెలియదా..అంటూ వంటూ హేమవర్ధన్ అనే ప్రయాణికుడు వాగ్వాదానికి దిగాడు. దీంతో డ్రైవర్ మహ్మద్ బస్సునిండా ప్రయాణికులున్నారని, ఎక్కవద్దని చెప్పాను కదా అంటూ వాదించాడు. గుడిపాడు దగ్గరకు రాగానే బస్సు దిగి డ్రైవర్పై రాయితో హేమవర్ధన్ దాడిచేశాడు. డ్రైవర్ తలకు తీవ్ర రక్తగాయమైంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు దువ్వూరు ఎస్ఐ వినోద్ కుమార్ తెలిపారు.
ఏడుగురు జూదరుల అరెస్ట్
ప్రొద్దుటూరు క్రైం : మండలంలోని ఎర్రగుంట్ల రోడ్డులోని ఏకో పార్కు సమీపంలో పేకాడుతున్న ఏడుగురిని రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. రూరల్ ఎస్ఐలు అరుణ్రెడ్డి, కేపీ రాజు సిబ్బందితో కలిసి పేకాట స్థావరాలపై మంగళవారం దాడులు నిర్వహించారు. ఏడుగురిని అరెస్ట్ చేసి వారి నుంచి రూ.81వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు.
చిట్టీ డబ్బు చెల్లించలేనంటూ..
బి.కొత్తకోట : బి.కొత్తకోట మండలంలో ఎనిమిదేళ్లు పనిచేసిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు చిట్టీలు నిర్వహిస్తూ సకాలంలో డబ్బులు చెల్లించేవాడు. దీంతో ఉపాధ్యాయులతోపాటు స్థానికుల్లో నమ్మకం కుదిరింది. భారీ సంఖ్యలో ఇతడి వద్ద చిట్టీలు వేశారు. రూ.4 కోట్లు చెల్లించాల్సి ఉంది. మూడు రోజులు క్రితం తాను డబ్బు చెల్లించాల్సిన వ్యక్తుల ఫోన్ నెంబర్లతో ఒక వాట్సాప్ గ్రూపు ఏర్పాటుచేసి చిట్టీ డబ్బులు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నానని చెప్పుకున్నాడు.

ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థికి గోల్డ్ మెడల్