
కొనసాగుతున్న వర్షాలు
కడప అగ్రికల్చర్: అల్పపీడనం కారణంగా జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం కొండాపురంలో అత్యధికంగా 20.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే సింహాద్రిపురంలో 10.6 మి.మీ, లింగాలలో 9.2, జమ్మలమడుగులో 4.2, మైలవరంలో 3.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
నకిలీ సర్టిఫికెట్స్పై విజి’లెన్స్’
కడప రూరల్: జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న కొంత మంది సిబ్బంది బోగస్ సర్టిఫికెట్స్ ద్వారా ఉద్యోగాలు కల్పించారన్న అంశంపై ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై ‘సాక్షి’ పలు కథనాలు ప్రచురించింది. ఈ అంశానికి సంబంధించి విజిలెన్స్ శాఖ విచారణ చేపడుతోంది. అందులో భాగంగా ఆ శాఖ ఆదేశాల మేరకు మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అందుకు సంబంధించిన ఫైల్స్ను తీసుకెళ్లి విజిలెన్స్ అధికారులకు అందజేసినట్లుగా తెలిసింది. విచారణ అనంతరం వెలువడే అంశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
డిగ్రీ ఇన్స్టెంట్ పరీక్షల తనిఖీ
కడప ఎడ్యుకేషన్: యోగి వేమన విశ్వవిద్యాలయ కేంద్రంగా జిల్లాలోని అన్ని డిగ్రీ కళాశాలల విద్యార్థులకు సెమిస్టర్ ఇన్స్టెంట్ పరీక్షలను మంగళవారం విశ్వవిద్యాలయ ఏపీజే అబ్దుల్ కలాం గ్రంథాలయ ప్రాంగణంలో ప్రారంభమయ్యాయి. విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ కే ఎస్వీ కృష్ణారావుతో కలిసి పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేశారు. విద్యార్థుల హాల్ టికెట్లను పరిశీలించారు. దీంతోపాటు పరీక్షా కేంద్రంలో వసతులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణలో తీసుకుంటున్న జాగ్రత్తలను అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్ డాక్టర్ టి.లక్ష్మి ప్రసాద్ వివరించారు. 278 మంది పరీక్షలకు హాజరు కాగా, ఏడుగురు విద్యార్థులు గైర్హాజరు అయ్యారని కృష్ణారావు తెలిపారు.
ప్రతిష్టాత్మకంగా పీ4 అమలు
కడప సెవెన్రోడ్స్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీ4 కార్యక్రమాన్ని జిల్లాలో పటిష్టంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఈ అంశంపై కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లాలో ఈ నెల 19వ తేదీ నుంచి పీ4 అమలు చేయాలన్నారు. జిల్లాలో పేదరిక నిర్మూలనకు చేపడుతున్న పీ4 లక్ష్యాన్ని 2029 నాటికి సాకారం చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బంగారు కుటుంబాలకు మెరుగైన జీవన ప్రమాణాలే లక్ష్యమన్నారు. సమాజానికి తిరిగి ఇవ్వాలన్నదే ప్రధాన ఉద్దేశంతో.. మార్గదర్శుల నుంచి అందే చిన్న ఆసరా పేదలకు కొండంత అండ అవుతుందన్నారు. డబ్బుతోపాటు సాయం చేసే వారు కూడా మార్గదర్శులే అని, ఆ దిశగా మార్గదర్శులను ప్రోత్సహించాలన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ అదితిసింగ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
‘పోషకాహారం’పై ఒప్పందం
కడప సెవెన్రోడ్స్: సాంకేతిక మద్దతు ద్వారా పోషకాహారం–వ్యవసాయ కన్వర్జెన్స్ను ప్రారంభించడం (ఎనాక్ట్స్) అనే కార్యక్రమాన్ని జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద చేపట్టేందుకు జిల్లా పరిపాలన యంత్రాంగం, ఇండియన్ స్కూలు ఆఫ్ బిజినెస్ హైదరాబాదు మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. మంగళవారం కలెక్టర్ శ్రీధర్ తన చాంబర్లో డిజిటల్ సైన్ చేసిన అవగాహన ఒప్పంద పత్రాన్ని ఐఎస్బీ బీఐపీపీ అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అశ్విని ఛాత్రేకి సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఐఎస్బీ, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ద్వారా సమకూరే నిధులతో సాంకేతిక మద్దతు ద్వారా పోషకాలు అధికంగా ఉండే ఆహార పదార్థాల లభ్యత, అందుబాటు, పౌష్టిక సామర్థ్యాన్ని మెరుగు పరిచేందుకే ఈ ప్రాజెక్టును జిల్లాలో అమలు చేస్తున్నామన్నారు. అంగన్వాడీ కేంద్రాలు, మధ్యాహ్న భోజన పథకం, గర్భిణులు, బాలింతలకు అవసరమైన సంపూర్ణ పోషణ కోసం ఆహార పంటల ఉత్పత్తిని పెంపొందించే దిశగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఎస్హెచ్జీలు, రైతులు, అంగన్వాడీ కార్యకర్తలు ప్రాజెక్టులో భాగస్వాములు అవుతారన్నారు. ఈ కార్యక్రమంలో ఎనాక్ట్స్ ప్రతినిధులు వైష్ణవి, శ్మతి, డీఆర్డీఏ పీడీ రాజ్యలక్ష్మి, డిప్యూటీ డీఎంహెచ్ఓ మహేశ్వరకుమార్, ఐసీడీఎస్, వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు పాల్గొన్నారు.

కొనసాగుతున్న వర్షాలు