
భూ తగాదా కేసులో ఏడుగురి అరెస్టు
చాపాడు : గత నెల 27న రాజుపాళెం గ్రామ సమీపంలోని పెన్నానది పరివాహంలో గల ప్రభుత్వ బంజరు భూమి విషయమై తలెత్తిన ఘర్షణలో సోమవారం ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ చిన్న పెద్దయ్య తెలిపారు. పల్లెం శ్రీనివాసులు, నలసింగ్ పెద్ద కుళ్లాయప్ప వర్గీయుల మధ్య గత నెల 27న ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఇరువర్గాలకు చెందిన వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు 14 మందిపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే శ్రీనివాసులు వర్గీయులను అరెస్టు చేయగా, సోమవారం నలసింగ్ పెద్దకుళ్లాయప్పతో పాటు అతని వర్గీయులైన మధు, పవన్, గంగయ్య, కిషోర్, బాబు, కృష్ణయ్యలను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయ మూర్తి రిమాండ్ విధించినట్లు ఎస్ఐ తెలిపారు.
తప్పిన పెను ప్రమాదం
లింగాల : మండలంలోని లోపట్నూతల గ్రామానికి చెందిన వెంగళరెడ్డి సోమవారం తన బొలెరో వాహనంలో పులివెందుల నుంచి స్వగ్రామానికి వస్తుండగా, లింగాల గ్రామంలోని ఆంజనేయస్వామి దేవాలయం వద్ద బొలెరో వాహనం పక్కనే ఉన్న పొలంలోకి దూసుకెళ్లింది. లింగాలకు చెందిన ఆదినారాయణ రెడ్డి రోడ్డుపై స్కూటీని కుడివైపు తిప్పుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. స్కూటీ అకస్మాత్తుగా ఎదురుగా రావడంతో, ఢీకొట్టకుండా తప్పించే ప్రయత్నంలో వెంగళరెడ్డి డ్రైవింగ్ చేస్తున్న సమయంలో బొలెరో అదుపు తప్పి రోడ్డుమీద నుండి పొలంలోకి వెళ్లింది. ఈ ప్రమాదంలో ఆదినారాయణరెడ్డికి స్వల్ప గాయాలు కాగా, ఎవరూ తీవ్రంగా గాయపడలేదు.
రిమ్స్ మార్చురీలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం
కడప అర్బన్ : కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్)లో ఈనెల 3వ తేదీన గుర్తు తెలియని వ్యక్తిని చికిత్స కోసం చేర్పించారు. అనంతరం 4వ తేదీన పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. మృతదేహాన్ని రిమ్స్ మార్చురీలో ఉంచారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు తగిన ఆధారాలతో తమను సంప్రదించాలని రిమ్స్ అధికారులు కోరారు.

భూ తగాదా కేసులో ఏడుగురి అరెస్టు