
‘షైనింగ్ స్టార్స్’తో ఉజ్వల భవిష్యత్తు
కడప ఎడ్యుకేషన్ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘షైనింగ్ స్టార్స్–2025‘ అవార్డులు విద్యార్థుల ఉన్నత చదువులు, ఉజ్వల భవిష్యత్తుకు ప్రోత్సాహాన్ని అందిస్తాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. సోమవారం కడపలోని మాధవి కన్వెన్షన్ హాలులో.. 2024–25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి, ఇంటర్మీడియట్లో జిల్లా స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు షైనింగ్ స్టార్స్–2025 పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రూ.20 వేల నగదు బహుమతి, సత్కారం చేసే కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, జేసీ అదితిసింగ్, ఎమ్మెల్సీలు ఎం.వి. రామచంద్రారెడ్డి, బి.రాంగోపాల్ రెడ్డి, జిల్లా మార్కెటింగ్ కో ఆపరేటివ్ సొసైటీ (డీసీఎంఎస్) చైర్మన్ జయప్రకాష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం కష్టం కాదని, లక్ష్యాన్ని చేరుకోవడంలో ప్రణాళిక ప్రకారం, దృఢ సంకల్పంతో అడుగులు వేయాలన్నారు. పిల్లల్లో ఉన్న ప్రతిభను తల్లిదండ్రులు గుర్తించాలన్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులు కూడా విద్యార్థుల అభీష్టాన్ని గుర్తించి వెన్ను తట్టి ప్రోత్సహించాలన్నారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఆత్మ విశ్వాసంతో లక్ష్యం వైపు అడుగేస్తే లక్ష్యం చేరుకోవడం కష్టం కాదని తెలిపారు. జేసీ అదితిసింగ్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఉన్నత ఆశయంతో.. లక్ష్యం వైపు అడుగులేయాలని సూచించారు. ఇంటర్మీడియట్ ఆర్జేడీ ఎ. శ్రీనివాసులు, ఆర్ఐఓ వెంకట సుబ్బయ్య, డీఈఓ షంషుద్దీన్ మాట్లాడారు. అనంతరం వైఎస్ఆర్ కడప జిల్లాలో 10వ తరగతి, ఇంటర్మీడియట్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 266 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. 20వేలు చొప్పున మంజూరైన రూ.53,20,000 మెగా చెక్కును జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అతిథులతో కలిసి విద్యాశాఖ అధికారులు, విద్యార్థులకు అందజేశారు. అనంతరం ప్రశంసా పత్రాలు, పతకాలను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కళాశాలల లెక్చరర్లు, ఉపాధ్యాయులు, ఎంఈఓలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్