
పోస్టల్ ఇన్సూరెన్స్ భళా!
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ప్రైవేట్ పాలసీలు ఎన్ని వస్తున్నా తపాలా పాలసీలపై ప్రజలకు నమ్మకం ఎక్కువ. తక్కువ చెల్లింపులతో ఎక్కువ బోనస్ ఇస్తారనే విశ్వాసం ఉంది. తపాలా శాఖలో పలు పాలసీలు ఉన్నా ప్రజల్లో అవగాహన ఆశించిన స్థాయిలో లేదు. జీవిత బీమా పథకం ప్రజల జీవితాలకు ఆర్థిక భరోసా ఇచ్చేలా దోహదపడుతోంది. 1884 ఫిబ్రవరి 1న కేవలం తపాలా శాఖలో ఉద్యోగం చేసే వారి కోసం ప్రారంభమైన పీఎల్ఐ(పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్)ను కాలక్రమేణా అందరికీ అందుబాటులోకి తెచ్చారు.
తపాలా బీమా పాలసీలను 18 నుంచి 55 సంవత్సరాల లోపు వయస్సు గలవారు తీసుకోవచ్చు. రూ.50 లక్షల వరకు తీసుకునే సౌకర్యం ఉంది. పాలసీలు 3 నెలలు, 6 నెలలు, సంవత్సరానికి ఒకసారి చెల్లించే సౌలభ్యముంది. ప్రధానంగా ఆరు రకాల పాలసీలు అమలవుతున్నాయి. వాటిలో సంతోష్, సువిధ, సుమంగళి, యుగళ్ సురక్ష, సురక్ష బాలాజీ పాలసీలు ఉన్నాయి. వీటిపై ప్రజల్లో చాలా మందికి అవగాహన లేదు. దీనిపై తపాలా శాఖ అధికారులు సభలు, సమావేశం నిర్వహించి మరింత అవగాహన కల్పిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది.
పాలసీ వివరాలు..
● ఎండోమెంట్ అస్యూరెన్స్(సంతోష్)
ఈ పాలసీకి 19 నుంచి 55 సంవత్సరాల వయస్సు గల వారు అర్హులు. కనీస బీమా రూ. 20 వేలు, గరిష్ట బీమా రూ. 50 లక్షలు. పాలసీ తీసుకున్న మూడు సంవత్సరాల తర్వాత రుణ సదుపాయం. మూడు సంవత్సరాలు దాటితే ఎప్పుడైనా పాలసీ సరెండర్కు అవకాశం ఉంది. ఐదు సంవత్సరాలు దాటిన పాలసీల సరెండర్పై బోనస్లో కోత ఉంటుంది. ఏటా ప్రతి వెయ్యికి రూ. 52 చొప్పున బోనస్ లభిస్తుంది.
● కన్వర్టబుల్ హోల్లైఫ్ అస్యూరెన్స్(సువిధ)
ఈ పాలసీకి 19 నుంచి 50 సంవత్సరాల వయస్సు గల వారు అర్హులు. కనీస బీమా రూ. 20 వేలు, గరిష్ట బీమా రూ. 50 లక్షలు, పాలసీ తీసుకున్న నాలుగు సంవత్సరాల తర్వాత రుణ సదుపాయం. మూడు సంవత్సరాలు దాటితే ఎప్పుడైనా పాలసీ సరెండర్కు అవకాశం. ఐదు సంవత్సరాల లోపు సరెండర్ చేస్తే బోనస్ రాదు. ఐదు సంవత్సరాలు దాటిన పాలసీల సరెండర్పై బోనస్లలో కోత . ఏటా ప్రతి వెయ్యికి రూ. 72 చొప్పున బోనస్ లభిస్తుంది. ఐదు సంవత్సరాలు (ఆరు సంవత్సరాలు దాటరాదు) ఎండోమెంట్ అస్యూరెన్స్ స్కీమ్లోకి మారవచ్చు. అప్పుడు బోనస్లు అదే పద్ధతిలో లభిస్తాయి. అయితే కన్వర్షన్ లేకపోతే అస్యూరెన్స్గా పరిగణిస్తారు.
● యాంటీసిపేటెడ్ ఎండోమెంట్ అస్యూరెన్స్ (సుమంగళ్)
ఇది మనీ బ్యాక్ పాలసీ. ఈ పాలసీకి 19 నుంచి 45 సంవత్సరాల వయస్సు గల వారు అర్హులు. పాలసీ కాలపరిమితి 15–20 సంవత్సరాలు, 15 సంవత్సరాల పాలసీపై 6,9,12 సంవత్సరాలు పూర్తయితే 20 శాతం, మెచ్యూరిటీపై 40 శాతం బోనస్. 20 సంవత్సరాల పాలసీపై 8,12,16 సంవత్సరాలు పూర్తయితే 20 శాతం, మెచ్యూరిటీపై 40 శాతం బోనస్. ప్రతి ఏటా వెయ్యికి రూ.48 చొప్పున బోనస్ లభిస్తుంది.
● జాయింట్ లైఫ్ అస్యూరెన్స్
(యుగళ్ సురక్ష)
21–45 సంవత్సరాల దంపతులు అర్హులు. కనీస బీమా రూ. 20 వేలు, గరిష్ట బీమా రూ. 50 లక్షలు. పాలసీ కాలపరిమితి 5–20 సంవత్సరాలు. పాలసీ తీసుకున్న మూడు సంవత్సరాల తర్వాత రుణ సదుపాయం. ఐదు సంవత్సరాలు దాటిన పాలసీల సరెండర్పై బోనస్లో కోత, మరణానంతర ప్రయోజనాలు భాగస్వామికి లేదా వారి వారసులకు వెళ్తాయి. ప్రతి ఏటా వెయ్యికి రూ. 52 చొప్పున బోనస్ లభిస్తుంది. సింగిల్ ప్రీమియంతో భార్యాభర్తల బీమా కవరేజీని పొడిగించుకోవచ్చు.
● హోల్లైఫ్ అస్యూరెన్స్ (సురక్ష)
ఈ పాలసీకి 19 నుంచి 55 సంవత్సరాల వయస్సు గల వారు అర్హులు. కనీస బీమా రూ. 20 వేలు, గరిష్ట బీమా రూ. 50 లక్షలు. ప్రీమియం చెల్లించే వయస్సును 55, 58, 60 సంవత్సరాలుగా ఎంచుకోవచ్చు. పాలసీ తీసుకున్న నాలుగు సంవత్సరాల తర్వాత రుణ సదుపాయం. మూడు సంవత్సరాలు దాటితే ఎప్పుడైనా పాలసీ సరెండర్కు అవకాశం. ఐదేండ్ల లోపు సరెండర్ చేస్తే బోనస్ రాదు. ఐదేండ్లు దాటిన పాలసీల సరెండర్పై బోనస్లో కోత. ఏటా ప్రతి వెయ్యికి రూ. 76 చొప్పున బోనస్ లభిస్తుంది. పాలసీదారుడికి 59 ఏళ్ల దాకా ఈ స్కీమ్ను ఎండోమెంట్ అస్యూరెన్స్ పాలసీల్లోకి మార్చుకోవడానికి వీలుంటుంది. పాలసీదారుకు వయసు 80 దాటితే లేదా పాలసీదారు చనిపోతే వారి వారసులకు బీమా సొమ్ము దానిపై బోనస్ ప్రయోజనాన్ని చెల్లిస్తారు.
● చిల్డ్రన్ పాలసీ (బాల్ జీవన్ బీమా)
పాలసీదారుల పిల్లల కోసమే ఈ పథకాన్ని తీసుకొచ్చారు. గరిష్టంగా ఇద్దరు పిల్లలకు బీమా చేసుకునే వెసులుబాటును కల్పించారు. పిల్లల వయస్సు తప్పనిసరిగా 5 నుంచి 20 ఏళ్ల మధ్య ఉండాలి. పిల్లలకు గరిష్టంగా రూ. 3లక్షలు లేదా పాలసీదారు బీమా(సమ్ అస్యూర్డ్) ప్రకారం (ఏదితక్కువైతే అది) ఇస్సూరెన్స్ తీసుకోవచ్చు. పాలసీదారు (పిల్లల తండ్రి) వయస్సు 45 ఏళ్లు దాటరాదు. పాలసీదారు చనిపోతే పిల్లలపై తీసుకున్న బీమాకు ప్రీమియం చెల్లించనక్కర్లేదు. కాలపరిమితి తీరాక బీమా సొమ్ము బోనస్లు వస్తాయి. రుణ సదుపాయం, సరెండర్ సౌకర్యం ఉండవు. ప్రీమియం తల్లిదండ్రులే చెల్లించాలి. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి. అయినప్పటికి వీరికి ఎలాంటి వైద్య పరీక్షలు నిర్వహించరు. ఎండోమెంట్ పాలసీ ప్రకారం బోనస్లు వర్తిస్తాయి.
పాలసీలు ఉపయోగకరం..
తపాలాశాఖ ద్వారా అందే బీమా పాలసీలు ఎంతో ఉపయోగకరం. ఇతర బీమా సంస్థల నుంచి వచ్చే రాబడి కంటే మెరుగైన ఆదాయం వస్తుంది. అన్ని రకాల ఉద్యోగులు పీఎల్ఐ పాలసీలను అన్ని తపాలా కార్యాలయాల్లో పొందవచ్చు.పాలసీలు తీసుకుంటే కుటుంబానికి భరోసా ఉంటుంది.
– రాజేష్, తపాలాశాఖ సూపరింటెండెంట్, కడప డివిజన్
ప్రజలు, ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి
పీఎల్ఐ పాలసీని ప్రజలు, ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి. ఈ పాలసీపై గ్రామాల్లో, నగరంలో విస్తృతంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ఈ పాలసీ తీసుకుంటే కుటుంబానికి జీవన రక్షగా ఉంటుంది.
– మునాఫ్, పీఎల్ఐ డెవలప్మెంట్ మేనేజర్, కడప డివిజన్
ప్రతి ఒక్కరి పాలసీ కుటుంబాలకు ఉపయోగకరం
ప్రజలు ప్రతి ఒక్కరు పాలసీలు తీసుకోవడం ద్వారా వారికి వారి కుటుంబ సభ్యులకు ఎంతగానో మేలు చేకూరుతుంది. తపాలా శాఖ అందించే అనేక పీఎల్ఐ స్కీమ్లు ఉన్నాయి. వీటిపై అవగాహన పెంచుకొని పాలసీలు తీసుకోవాలి.
–విజయ్ భాస్కర్, అసిస్టెంట్ తపాలాశాఖ సూపరింటెండెంట్, కడప డివిజన్