నల్లగొండ టూటౌన్ : ప్లాస్టిక్ నియంత్రణ ద్వారానే సుస్థిరాభివృద్ధి సాధ్యమని ఎంజీయూ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ మారం వెంకటరమణారెడ్డి అన్నారు. సోమవారం నల్లగొండలోని ఎంజీ యూనివర్సిటీలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పర్యావరణ మార్పును ఎదుర్కోవడంలో విద్యార్థులు క్రియాశీలక పాత్ర పోషించాలని కోరారు. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రం ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితులను వివరిస్తూ.. పర్యావరణహితమైన జీవితం కార్యాచరణ విద్యార్థుల నుంచే ప్రారంభం కావాలన్నారు. అనంతరం ఆర్ట్స్, బిజినెస్ మేనేజ్మెంట్, సైన్స్, ఇంజనీరింగ్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు, విద్యార్థులతో కలిసి ప్లాస్టిక్ రహిత క్యాంపస్ ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.వసంత, నీలకంఠం శేఖర్, కిరణ్మయి, రమేష్ నాయక్, శ్రీనివాస్, శ్రీధర్ రావు, సత్తిరెడ్డి, మౌనిక తదితరులు పాల్గొన్నారు.


