భువనగిరిటౌన్ : మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు కోడిగుడ్లు పెట్టడం భారంగా మారుతోందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ అన్నారు. ప్రస్తుతం ఇస్తున్న గుడ్డుపై అదనంగా రూ.2లు ఇవ్వాలని కోరుతూ శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టరేట్ ఏఓ అంజిరెడ్డి, డీఈఓ బొల్లారం భిక్షపతికి ఏఐటీయూసీ నాయకులతో కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కోడి గుడ్డుకు రూ.6 మాత్రమే ఇస్తుండగా, మార్కెట్లో రూ.8 ఉందన్నారు. నెలకు రూ.3 వేల వేతనం పొందే కార్మికులు ప్రతి గుడ్డుపై రూ.2 అదనంగా భరించాల్సి వస్తోందని తెలిపారు. మార్కెట్ రేటు ప్రకారం కోడి గుడ్డు ధర సవరించాలన్నారు. ఎన్నికల హామీ మేరకు రూ.10,000 గౌరవ వేతనం, సామాజిక భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రతినెలా 5వ తేదీలోపు వేతనాలు, బిల్లులు చెల్లించడంతో పాటు గ్యాస్, వంట సామగ్రి ప్రభుత్వమే సరఫరా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజనం పథకం జిల్లా ప్రధాన కార్యదర్శి ముంతాజ్ బేగం, నాయకులు రాజమణి, బుచ్చయ్య, శ్యామ్, గీత, బాలమణి, నీలమ్మ, పుష్ప, లలిత, అరుణ, అండాలు, వాణి, సుగుణ తదితరులు పాల్గొన్నారు.


