కారు ఢీకొని యువకుడి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

కారు ఢీకొని యువకుడి దుర్మరణం

Jul 24 2026 1:57 AM | Updated on Jul 24 2026 1:57 AM

తిరుమలగిరి (తుంగతుర్తి) : బైక్‌పై వెళ్తున్న యువకుడిని కారు ఢీకొనడంతో మృతిచెందాడు. ఈ ఘటన తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని అనంతారంలో బుధవారం అర్ధరాత్రి జరిగింది. గురువారం ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అడ్డగూడూరు మండల కేంద్రానికి చెందిన బాలెంల మల్లు స్వామి(34) బుధవారం పని నిమిత్తం బైక్‌పై తిరుమలగిరికి వచ్చాడు. రాత్రి తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా.. తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని అనంతారం బ్రిడ్జి సమీపంలోకి రాగానే వెనుక నుంచి కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో మల్లు స్వామి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు.

విద్యుదాఘాతంతో

మెకానిక్‌ మృతి

చండూరు : బోరు మోటారు రిపేర్‌ చేసేందుకు వచ్చిన మెకానిక్‌ ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. ఈ ఘటన చండూరు మండలం పుల్లెంల గ్రామంలో గురువారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. చండూరు మండలం లకినేనిగూడెం గ్రామానికి చెందిన షేక్‌ సయ్యద్‌(38) బోరు మోటారు మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. గురువారం పుల్లెంల గ్రామానికి చెందిన బద్దుల స్వామి వ్యవసాయ మోటారు రిపేరు చేసేందుకు సయ్యద్‌ వచ్చాడు. మోటారు రిపేరు పూర్తిచేసిన తర్వాత మోటారు ఆన్‌ చేసేందుకు సయ్యద్‌ స్టాటర్‌ బాక్స్‌ వద్దకు వెళ్లగా.. భూమి తడిగా ఉండడంతో ఎర్త్‌ వచ్చి విద్యుదాఘాతానికి గురై కిందపడిపోయాడు. చుట్టుపక్కల రైతులు 108 అంబులెన్స్‌లో నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

బూజుపట్టిన కేక్‌ తిని

చిన్నారులకు అస్వస్థత

గరిడేపల్లి : బూజుపట్టిన కేక్‌ తిని చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన గరిడేపల్లి మండలం సర్వారం గ్రామంలో గురువారం వెలుగులోకి వచ్చింది. వివరాలు..సర్వారం గ్రామానికి చెందిన భరత్‌ తన కుమారుడి పుట్టినరోజు సందర్భంగా బుధవారం కీతవారిగూడెంలోని ఓ బేకరీ నుంచి కిలో కేక్‌ కొనుగోలు చేశాడు. రాత్రి ఇంట్లో పుట్టినరోజు వేడుక నిర్వహించి తన కుమారుడితో పాటు అతడి స్నేహితులు, కుటుంబ సభ్యులకు కేక్‌ పెట్టాడు. అనంతరం కేక్‌ను పరిశీలించగా దానికి బూజు పట్టినట్లు గుర్తించారు. కేక్‌ తిన్న చిన్నారులు అస్వస్థతకు గురికావడంతో వెంటనే వారిని సమీపంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. గురువారం భరత్‌, అతడి స్నేహితులు కలిసి కీతవారిగూడెంలోని బేకరీ వద్దకు వెళ్లి బూజుపట్టిన కేక్‌ విక్రయించడంపై నిలదీశారు. అయినపప్పటికీ బేకరీ నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణలపై బేకరీ నిర్వాహకులు స్పందిస్తూ.. తమ బేకరీలో కేకులు తయారు చేయడం లేదని, గరిడేపల్లిలోని మరో బేకరీలో తయారైన కేకులను తీసుకొచ్చి తాముఉ విక్రయిస్తున్నామని తెలిపారు.

నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడులు

14 లీటర్ల సారా స్వాధీనం

400 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

దేవరకొండ : దేవరకొండ మండలం ఇద్దంపల్లి, పూసల్‌రాం తండా, లచ్య తండా, పాత్లావత్‌ తండా, మేగ్యా తండాల్లో నాటుసారా స్థావరాలపై గురువారం టాస్క్‌ఫోర్స్‌, నల్లగొండ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, ఎకై ్సజ్‌ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 14 లీటర్ల నాటుసారా, 70 కేజీల నల్లబెల్లం, 90 కిలోల పటిక స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా 400 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేసినట్లు దేవరకొండ ఎకై ్సజ్‌ సీఐ శ్రీనివాస్‌ తెలిపారు. ఆరుగురిపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement