నల్లగొండ : పేదరికం ప్రతిభకు అడ్డుకాకూడదనే ఉద్దేశంతో దేవరకొండకు చెందిన నిరుపేద విద్యార్థిని పరిమళ ఉన్నత చదువులకు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆర్థిక భరోసా అందించారు. రోజువారీ కూలీ కుటుంబానికి చెందిన పరిమళ ఐఐటీ మద్రాస్లో ఇంజనీరింగ్ పూర్తిచేసి జర్మనీలోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య(మాస్టర్స్) అభ్యసించేందుకు సీటు సాధించింది. అయితే కుటుంబ ఆర్థిక ఇబ్బందుల వల్ల విదేశీ విద్య సాధ్యమవుతుందా లేదా అనే అనిశ్చితి ఏర్పడింది. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే బాలునాయక్ తెలుసుకుని పరిమళ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అనంతరం సమస్యను మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి హైదరాబాద్లో ఆయనను కలిసేలా ఏర్పాట్లు చేశారు. పరిమళ ప్రతిభను, అంకితభావాన్ని అభినందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ‘కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్’ ద్వారా తక్షణమే రూ.10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించి అందజేశారు. తనకు సాయం చేసినందుకు గాను మంత్రి కోమటిరెడ్డికి పరిమళ ధన్యవాదాలు తెలిపింది.


