చండూరు : వ్యవసాయ భూమిలో వేలాడుతున్న 11కేవీ విద్యుత్ వైర్లను తాకడంతో విద్యుదాఘాతానికి గురై పాలిటెక్నిక్ విద్యార్థి మృతిచెందాడు. ఈ ఘటన చండూరు మండలం చొప్పరివారిగూడెంలో బుధవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. చొప్పరివారిగూడేనికి చెందిన చొప్పరి వెంకన్న చిన్న కుమారుడు చందు(16) నల్లగొండలో పాలిటెక్నిక్ చదువుతున్నాడు. వేసవి సెలవులు కావడంతో స్వగ్రామంలోనే ఉంటున్న చందు బుధవారం ఉదయం తమ వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. ఇటీవల వచ్చిన గాలి దుమారానికి 11కేవీ విద్యుత్ వైర్లు వదులై కిందకు వేలాడుతుండగా.. చందు వాటిని తాకడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. అటుగా వెళ్లే వారు గమనించి చందు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శివకుమార్ తెలిపారు.


