నల్లగొండ : నల్లగొండ జిల్లా విద్యాధికారి(డీఈఓ) బొల్లారం భిక్షపతి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో రంగారెడ్డి జిల్లా డీఈఓ సుశీందర్రావు నల్లగొండకు రానున్నారు. డీఈఓ భిక్షపతి జిల్లాలో 6 సంవత్సరాల 7 నెలల పాటు ఆయన డీఈఓగా పని చేశారు. ప్రస్తుతం ఆయనను యాదాద్రి భువనగిరి జిల్లా డీఈఓగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నల్లగొండలో ఇప్పటివరకు ఇంత సుదీర్ఘకాలం పాటు డీఈఓగా పని చేసిన వారు లేరు. భిక్షపతి డీఈఓగా జిల్లాలో విద్యాభివృద్ధికి కృషి చేశారు. జాతీయ అవార్డులను అందుకున్నారు. ఈయన కాలంలో విద్యాశాఖలో రెండు పర్యాయాలు ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీలు జరిగాయి. 317 జీఓలో జరిగిన బదిలీల్లో ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా నిర్వహించి. ప్రజాప్రతినిధులతో, ఉపాధ్యాయ సంఘాలతో మన్ననలు పొందారు.
లక్ష్మీనరసింహునికి
నిత్య కల్యాణం
మఠంపల్లి : మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం అర్చకులు శాస్త్రోక్తంగా స్వామివారి కల్యాణాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, గర్భాలయంలోని మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేపట్టారు. కల్యాణ వేడుకలో భాగంగా విశ్వక్సేనపూజ, పుణ్యహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మదుఫర్కపూజ, మాంగల్యధారణ చేపట్టారు. అనంతరం స్వామి అమ్మవార్లను గరుడవాహనంపై అధిష్టింపజేసి ఆలయ తిరుమాడ వీధులలో ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్కుమార్, ఈఓ జ్యోతి, అర్చకులు రామాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, బ్రహ్మాచార్యులు, ఆంజనేయాచార్యులు, నరేందర్, భక్తులు పాల్గొన్నారు.


