మిర్యాలగూడ టౌన్ : చేపల వేటకు వెళ్లి గల్లంతైన వ్యక్తి మృతదేహం శనివారం లభ్యమైంది. మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ మల్లికంటి లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం యాద్గార్పల్లి గ్రామానికి చెందిన నూకల శంకర్ (38) అనే వ్యక్తి గురువారం రాత్రి 11గంటలకు యాద్గార్పల్లి చెరువులో చేపల వల వేసే సమయంలో ప్రమాదవశాత్తు కాలుజారి పడిపోయి గల్లంతయ్యాడు. దీంతో సాగర్ నుంచి వచ్చిన రెస్క్యూ టీం గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం ఉదయం శంకర్ మృతదేహం లభ్యంకాగా.. పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


