నూతనకల్: అనారోగ్యంతో మృతిచెందిన మహిళకు గ్రామస్తులు అంత్యక్రియలు నిర్వహించారు. ఈఘటన నూతనకల్ మండలం మాచనపల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు ప్రాంతానికి చెందిన మబ్బు సుబ్బారెడ్డి, మబ్బు లక్ష్మి దంపతులు 50 సంవత్సరాల క్రితం మాచనపల్లి గ్రామానికి వలస వచ్చి సుతారీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నప్పటికీ ఎలాంటి ప్రయోజకులు కాలేదు. ఆర్థిక ఇబ్బందులకు తోడు వయోభారం పెరిగి ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. మబ్బు లక్ష్మి(70) గత ఆరు సంవత్సరాల నుంచి అనారోగ్యానికి బాధపడుతుండగా శనివారం మృతి చెందింది. దహన సంస్కారాలు నిర్వహించేందుకు వారి కుటుంబం వద్ద డబ్బులు లేకపోవడంతో గ్రామస్తులే అండగా నిలిచి దహన సంస్కారాలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు.


