ఫ ఆసుయంత్ర సృష్టికర్త చింతకింది మల్లేశం
భూదాన్పోచంపల్లి: చేనేత మహిళా కార్మికులు ఆర్థిక స్వావలంబన సాఽధించాలని ఆసుయంత్ర సృష్టికర్త, పద్మశ్రీ చింతకింది మల్లేశం అన్నారు. శుక్రవారం భూదాన్పోచంపల్లి పట్టణ కేంద్రంలోని భద్రావతి కాలనీలో గల మాస్టర్వీవర్స్ అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చేనేతకు ప్రసిద్ధిగాంచిన పోచంపల్లిలో ప్రముఖ సామాజిక సేవా సంస్థ ‘యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్’ ఆధ్వర్యంలో జూన్ మొదటి వారంలో చేనేత మహిళా కార్మికులకు వృత్తి నైపుణ్యాలను పెంపొందించేందుకు లూమ్, ప్రీలూమ్పై ఉచితంగా శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మారుతున్న ప్రజల అభిరుచులకు అనుగుణంగా తమ వృత్తి నైఫుణ్యాలను మెరుగుపర్చుకోవాలన్నారు. గతంలో జనగాంలో విజయవంతంగా శిక్షణ తరగతులను పూర్తి చేశామని పేర్కొన్నారు. పోచంపల్లి పరిసరప్రాంతాల మహిళా చేనేత కార్మికులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ ప్రాజెక్ట్ లీడ్ కై రంకొండ దిలిప్కుమార్, మాస్టర్వీవర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు అంకం మురళి, అధ్యక్షుడు రాపోలు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు ఏలే పాండు, ప్రధాన కార్యదర్శి బోగ రమేశ్, సభ్యులు రుద్ర శ్రీశైలం, ఆడెపు అంజనేయులు, కుడికాల భాస్కర్, అంకం సాయి, చెన్నకేశవులు, చింతకింది దామోదర్, నక్క రాంచంద్రం, పెంట నవీన్, సకినాల నాగయ్య తదితరులు పాల్గొన్నారు.


