మిర్యాలగూడ టౌన్ : చేపల వేటకు వెళ్లి వ్యక్తి గల్లంతైన సంఘటన మిర్యాలగూడ మండలం యాద్గార్పల్లి గ్రామంలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. అతడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ మల్లికంటి లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం.. యాద్గార్పల్లి గ్రామానికి చెందిన నూకల శంకర్ తోటి మత్స్యకారులు నక్క అంజి, మేడారపు నాగయ్య, జిట్టబోయిన శివతో కలిసి గురువారం రాత్రి 11గంటల సమయంలో యాద్గార్పల్లి చెరువులో చేపల కోసం వలలు వేసేందుకు వెళ్లారు. చెరువు పెద్దగా ఉండటంతో నలుగురు నాలుగు దిక్కులుగా వెళ్లారు. వలలు వేసే సమయంలో ఈదురుగాలులు విపరీతంగా రావడంతో నూకల శంకర్ ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయాడు. విషయం తెలుసుకున్న మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ మల్లికంటి లక్ష్మయ్య నాగార్జున సాగర్ నుంచి నేషనల్ డిజాస్టర్ రెస్క్యూ టీం రప్పించి యాద్గార్పల్లి చెరువులో ఉదయం నుంచి బోట్ల సహకారంతో గాలింపు చర్యలు చేపట్టారు. సాయంత్రం వరకు కూడా శంకర్ ఆచూకీ కనిపించలేదు. అతడి తండ్రి నూకల లక్ష్యయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మల్లికంటి లక్ష్యయ్య తెలిపారు.
ఫ రెస్క్యూ టీంతో గాలింపు


