యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో శ్రీస్వామి వారి జన్మ నక్షత్రం స్వాతిని పురస్కరించుకొని శుక్రవారం విశేష పూజలు నిర్వహించారు. వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు ముఖ మండపంలో స్వాతి హోమం జరిపించారు. ముఖ మండపంలో బంగారు, వెండి కలశాలకు సంప్రదాయ పూజలు చేశారు. అనంతరం శ్రీస్వామి అమ్మవార్లకు శత ఘటాభిషేకం నిర్వహించారు. ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో గజవాహన సేవ, నిత్య కల్యాణం వేడుక జరిపించారు. వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు యాదగిరికొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేశారు. ఆయా వేడుకల్లో ఆలయ ఈఓ భవాని శంకర్, ఆలయాధికారులు, భక్తులు పాల్గొన్నారు.


