సాక్షి, యాదాద్రి : తడిసిన ధాన్యానికీ మద్దతు ధర అందిస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి వెల్లడించారు. గురువారం భువనగిరి కలెక్టరేట్లో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబులతో ఆయన ధాన్యం కొనుగోలుపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వరి సాగు, దిగుబడి, కొనుగోళ్లలోనూ మొదటి స్థానంలో నిలిచిందన్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఎంపీ, ఎమ్మెల్యేలు, కలెక్టర్, అధికారుల కృషిని మంత్రి అభినందించారు. ధాన్యం డబ్బులు 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేవలం కనీస మద్దతు ధరను ప్రకటించడం తప్ప కొనుగోళ్లకు, రైతులకు గానీ ఎలాంటి సహకారం అందించడం లేదని విమర్శించారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీఽనివాస్రెడ్డి మాట్లాడూతూ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు బాధ్యతను విస్మరించిప్రభుత్వంపై బురద జల్లుతున్నారన్నారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల కోసం పనిచేస్తుందన్నారు. కలెక్టర్ అనురాగ్ జయంత్రి ధాన్యం కొనుగోళ్ల తీరును ప్రొజెక్టర్ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్లు బీర్ల ఐలయ్య, వేముల వీరేశం, ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, ఎమ్మెల్యేలు కుంభం అనిల్కుమార్రెడ్డి, మందుల సామేల్, బండ్రు శోభారాణి, ఎస్పీ అక్షాంశ్యాదవ్, అదనపు కలెక్టర్లు ఎ.భాస్కర్రావు, కె.వెంకారెడ్డి, ఆర్డీఓలు మాలి కృష్ణారెడ్డి, శేఖర్రెడ్డి పాల్గొన్నారు.


