పుస్తకాలతో
మరింత జ్ఞానం
ప్రస్తుత సమాజంలో విద్యార్ధులతో పాటు పెద్దలు కూడా పుస్తకాలు చదవడం మరిచిపోయారు. గతంలో ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్లు లేని రోజుల్లో గ్రంథాలయాలకు వెళ్లి కథల పుస్తకాలు చదివేవాళ్లు. ప్రస్తుత వేసవి సెలవుల్లో విద్యార్ధులకు తల్లిదండ్రులు పుస్తక పఠనం అలవాటు చేయిస్తే వారి జ్ఞానం పెరుగుతుంది. – గడ్డమీది పాండుగౌడ్,
ప్రభుత్వ ఉపాధ్యాయుడు
మంచి
పుస్తకాలు కొనివ్వాలి
పిల్లలకు తల్లిదండ్రులు సెల్ఫోన్ కొనిచ్చే బదులు పుస్తకా కొనివ్వాలి. పిల్లలకు చిన్ననాటి నుంచి పుస్తకాలను చదవడం అలవాటు చేస్తే భవిష్యత్తులో ఉన్నతస్థాయికి వెళ్తారు. పుస్తకాలు చదవడం వలన ఎంతో మంది ఉన్నత స్థాయికి వెళ్లారు. ఒత్తిడి చేయకుండా పుస్తక పఠనం అలవాటు చేస్తే ఉపయోగం ఉంటుంది.
– సుక్క సందీప్, ఆర్కిటెక్ట్, యాదగిరిగుట్ట
యాదగిరిగుట్ట : చేతిలో స్మార్ట్ఫోన్, వేలి కొనలపై సోషల్ మీడియా ప్రపంచం.. వాట్సాప్, ఇన్స్ట్రాగామ్ రీల్స్తో నేటి తరం కాలక్షేపం చేస్తోంది. కానీ ఒకప్పటిలా మంచి కథల పుస్తకాలు, చందమామ కథలు చదివే రోజులు పోయాయి. సాంకేతిక ఎంత పెరిగినా పుస్తకం ఇచ్చే జ్ఞానాన్ని, మానసిక వికాసాన్ని ఇంటర్నెట్ ఇవ్వలేదు. చిన్నతనంలో అలవడే పఠనాసక్తి భవిష్యత్తులో వివేకవంతులుగా తీర్చిదిద్దుతుంది. ఈ వేసవిలో తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి పుస్తకాన్ని నేస్తం చేసి పుస్తక పఠనం అలవాటు చేయాలి.
పుస్తకాలతో తెలివితేటలు..
ప్రతిరోజు నిద్రపోయే ముందు చిన్నారులతో కథల పుస్తకాలు చదివిస్తే భవిష్యత్తులో వారి తెలివితేటలు బాగా వృద్ధి చెందుతాయని ఓ అధ్యయనంలో తేలింది. చిన్న వయస్సులో పిల్ల లు కథలంటే ఆసక్తి చూపుతారు. అలాంటి వారికి కథల పుస్తకాలు చదివే అలవాటు చేయాలి. ప్రపంచం గురించి తెలుసుకోవాలంటే పుస్తకం పఠనమే ముఖ్యం. పిల్లలకు అసమాన ప్రతిభా పాఠవాలను నేర్పించే వారు గురువులైతే.. వారికి తెలియని విషయాలను విశదీకరించే వాడు మిత్రుడు. మేధస్సు పెరగాలంటే పుస్తక పఠనం తప్పనిసరి. సమాజాన్ని అర్థం చేసుకునే రచనలు, కథలు, కథానికల ద్వారా ఎంతో నేర్చుకోవచ్చు. ఒకప్పుడు ప్రతి ఇంట్లో పుస్తకాలు తప్పకుండా ఉండేవి. ఇప్పుడు ఉరుకులు, పరుగుల జీవితంతో పుస్తక పఠనాన్ని తగ్గిస్తున్నారు.
పుస్తక పఠనం ఇలా అలవాటు చేయాలి..
● పిల్లలకు చిన్న చిన్న కథలు చదివి వినిపిస్తూ ఉండాలి. బాలల సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలను వారిచే చదివించాలి. అలా చేస్తే పిల్లలు తమకు తెలియకుండానే పుస్తకాలకు
ఆకర్షితులవుతారు.
● పిల్లల వయస్సుకు తగ్గ పుస్తకాలనే చదివించాలి. బొమ్మలుండే పుస్తకాలు ఇస్తే వాళ్లు అందులోని సారాంశాన్ని తొందరగా అర్థం చేసుకుంటారు.
● తల్లిదండ్రులు తరచూ తమ పిల్లలను గ్రంథాలయాలకు తీసుకెళ్తూ ఉండాలి. అలా చేయడం వలన పిల్లల్లో పుస్తకాలపై ఆసక్తి పెరుగుతుంది.
● పుట్టినరోజులకు పిల్లలకు మంచి పుస్తకాలను పిల్లలకు బహుమతిగా ఇవ్వాలి. ఇలా చేయడం వలన వారు పుస్తక పఠనంపై మక్కవ చూపుతారు.
ఇంటర్నెట్లోనూ పుస్తకాలు..
ఈ ఆధునిక యుగంలో తల్లిదండ్రులు వాడే స్మార్ట్ఫోన్లను పిల్లలు సైతం ఉపయోగిస్తున్నారు. పిల్లలకు నచ్చే పుస్తకాలను ఇంటర్నెట్ ద్వారా కూడా డౌన్లోడ్ చేసి వారిచే చదివించవచ్చు. అంతేకాకుండా తల్లిదండ్రులు తమ పిల్లలను వేసవి సెలవుల్లో గ్రంథలయాలకు తీసుకెళ్లాలి. వారిచే గ్రంథలయాల్లో ఉన్న మంచి పుస్తకాలు, నీతి కథలు, జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు చదివించడంతో జ్ఞానం పెంపొందించవచ్చు. సమాజంలో జరిగే కొత్త కొత్త సంఘటనలు కూడా పిల్లలకు గ్రంథలయాలకు వెళ్తే తెలుస్తుంటాయి.
మేము బొమ్మలు గీశామోచ్
పిల్లలు స్మార్ట్ఫోన్కు బానిస కాకుండా తల్లిదండ్రులు పుస్తకాలు చదవించాలి
పుస్తక పఠనంతో జ్ఞానం
పెరుగుతుందంటున్న నిపుణులు


