నల్లగొండ : నల్లగొండ పట్టణంలో మంగళవారం తెల్లవారుజామున పోలీసులు భారీ కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సతీష్నగర్తో పాటు పలు ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఎస్పీ శరత్చంద్ర పవార్, డీఎస్పీ శివరాంరెడ్డి ఆధ్వర్యంలో 7 మంది సీఐలు, 18 మంది ఎస్ఐలు, నార్కోటిక్ డాగ్తో కలిపి సుమారు 200 మంది పోలీసు అధికారులు ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. కాలనీలు, అనుమానిత ప్రాంతాలు, లాడ్జీలు, అద్దె గదులు, రైల్వే స్టేషన్, బస్టాండ్, ప్రధాన కూడళ్ల వద్ద తనిఖీలు నిర్వహించారు.
360 ఇళ్లలో తనిఖీలు..
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నల్లగొండలో సుమారు 360 ఇళ్లలో తనిఖీలు నిర్వహించి 46 మంది అనుమానితులను గుర్తించామన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన 18 మంది వ్యక్తులను గుర్తించామని, వీరిలో ఉత్తరప్రదేశ్కు చెందిన 10 మంది, బిహార్కు చెందిన నలుగురు, హర్యానాకు చెందిన ఇద్దరు, తమిళనాడు, అసోం రాష్ట్రాలకు చెందిన ఒక్కొక్కరు ఉన్నట్లు తెలిపారు. ఇద్దరు రౌడీషీటర్లు, ఐదుగురు ట్రబుల్ మాంగర్స్ను గుర్తించి వారిపై ప్రత్యేక నిఘా పెట్టామని ఎస్పీ పేర్కొన్నారు. ఆరుగురికి గంజాయి టెస్టులు నిర్వహించగా ఇద్దరు గంజాయి సేవించినట్లు తేలిందన్నారు. అక్రమంగా నిల్వ ఉంచిన 16 గుట్కా బ్యాగులు, సరైన పత్రాలు లేని 54 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు, నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. రెండు వాహనాలపై కేసులు నమోదు చేశామని వివరించారు.
7గురు సీఐలు, 18 మంది ఎస్ఐలు, 200 మంది పోలీసులతో తనిఖీలు
46 మంది అనుమానితుల గుర్తింపు
54 ద్విచక్ర వాహనాలు,
2 ఆటోలు స్వాధీనం


