ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వడదెబ్బకు గురై
శనివారం ఆరుగురు మృతిచెందారు.
తిరుమలగిరి(సాగర్) : వడదెబ్బకు గురై రైతు మృతిచెందాడు. తిరుమలగిరి(సాగర్) మండలం ఎర్రచెరువుతండాకు చెందిన రైతు ఆంగోతు యుగేంధర్(32) రెండు రోజుల క్రితం పత్తి కట్టె పీకేందుకు కూలీకి వెళ్లాడు. తీవ్రమైన ఎండలకు అతడికి వడదెబ్బ తగిలింది. కుటుంబ సభ్యులు నల్లగొండలోని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
నిద్రలోనే మృతి..
తిరుమలగిరి ( తుంగతుర్తి) : తిరుమలగిరి మున్సిపాలిటీకి చెందిన చౌగోని ప్రసాద్(31) స్థానికంగా ఓ హోటల్లో పనిచేస్తున్నాడు. రెండు రోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో శుక్రవారం అతడు తీవ్ర అస్వస్థకు గురై రాత్రి నిద్రలోనే మృతిచెందాడు.
కార్పెంటర్
చౌటుప్పల్ : మండలంలోని మందోళ్లగూడెం గ్రామానికి చెందిన దేవరకొండ శంకరయ్యచారి(65) కార్పెంటర్గా పనిచేస్తున్నాడు. పనిలో భాగంగా తన మనవడు మణికంఠను తీసుకొని ద్విచక్ర వాహనంపై చౌటుప్పల్కు వచ్చాడు. మధ్యాహ్నం తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా.. లింగారెడ్డిగూడెం శివారులోకి వెళ్లగానే కళ్లు తిరుగుతున్నాయని మనవడికి చెప్పి బైక్ను రోడ్డు పక్కన ఆపి స్పృహతప్పి పడిపోయాడు. అంబులెన్స్లో ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడి కుమారుకుడు శ్రీధర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు.
వృద్ధుడు..
మోత్కూరు : మండలంలోని పొడిచేడు గ్రామానికి చెందిన వరికుప్పల శంకరయ్య(65) ఎండలకు తాళలేక అస్వస్థతకు గురైన శనివారం మృతిచెందాడు. మృతుడి భార్య గతంలోనే చనిపోగా.. అతడికి ఒక కుమారుడు ఉన్నారు.
చికిత్స పొందుతూ..
ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట) : ఆత్మకూర్(ఎస్) మండల పరిధిలోని నెమ్మికల్కు చెందిన చెన్న హరికిషన్(50) ఎండలకు తాళలేక మూడు రోజులు క్రితం అస్వస్థతకు గురయ్యాడు. స్థానికంగా చికిత్స పొందుతూ శనివారం చనిపోయారు. మృతుడికి భార్య ఉంది.
వంట మాస్టర్..
మిర్యాలగూడ అర్బన్ : మిర్యాలగూడ పట్టణంలోని సీతారంపురానికి చెందిన వంట మాస్టర్ షేక్ ఇస్మాయిల్ (38) వారం రోజులుగా వంట పనిలో బిజీగా ఉండి శనివారం ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.


