దొంగతనం మహాపాపం
● నిడమనూరు మోడల్ స్కూల్లో కొనసాగుతున్న వేసవి శిబిరం
● డ్యాన్స్, చేతిరాత, డ్రాయింగ్పై విద్యార్థులకు శిక్షణ
● క్విజ్ పోటీలు, మాక్ పార్లమెంట్ నిర్వహించి విజ్ఞానం పంచుతున్న నిర్వాహకులు
నిడమనూరు : నిడమనూరులోని మోడల్ స్కూల్లో వేసవి శిబిరం చిన్నారులకు విజ్ఞానంతో పాటు వినోదాన్ని పంచుతోంది. ఈ శిబిరంలో 60 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పించగా.. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వివిధ క్రీడలతో పాటు వారికి నైపుణ్యం ఉన్న రంగాల్లో శిక్షణ ఇస్తున్నారు. ఈ నెల 11న ప్రారంభమైన ఈ వేసవి శిబిరం 25వ తేదీ వరకు కొనసాగనుంది. పలువురు విద్యార్థులకు డ్యాన్స్, డ్రాయింగ్, చేతి రాత మెరుగుపరచడం(పాలిగ్రఫీ), చెస్, క్యారమ్స్, గణితం, టీఎల్ఎం(టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్), అటల్ టింకరింగ్ ల్యాబ్లో వివిధ ప్రయోగాలు చేసేందుకు విద్యార్థులకు నిర్వాహకులు అవకాశం కల్పించారు. అదేవిధంగా క్విజ్ పోటీలు, మాక్ పార్లమెంట్ నిర్వహించి అనేక అంశాలను బోధిస్తున్నారు. ప్రతిరోజు ఉపాధ్యాయుల్లో ఒకరు విధులకు హాజరవుతూ విద్యార్థులకు వేసవి శిబిరం చార్ట్ అనుగుణంగా తరగతులు నిర్వహిస్తున్నారు.
కొత్త విషయాలు నేర్చుకుంటున్నా
వీడియోల ద్వారా పలు కథాంశాలను ఉపాధ్యాయులు వివరిస్తున్నారు. నీతి చంద్రిక, చందమామ కథలు, పంచతంత్ర కథలను అర్థమయ్యేరీతిలో చెబుతున్నారు. ఇంట్లో టీవీ చూసే కంటే స్నేహితులతో కలవడం ఆనందంగా ఉంది.
– ఎస్కే నిషూ, 6వ తరగతి, నిడమనూరు
భవిష్యత్తులో చెస్లో రాణిస్తా
స్నేహితులతో కలిసి చెస్ ఆడటం, కొత్త కొత్త ఎత్తులు నేర్చుకోవడం బాగుంది. ఈ నైపుణ్యాలతో మండల, జిల్లా స్థాయి టోర్నమెంట్లలో రాణించే అవకాశం ఉంటుంది. స్నేహితులతో ఆటపాటలు బాగున్నాయి. – ఆర్. నాగచైతన్య,
8వ తరగతి, మోడల్ స్కూల్, నిడమనూరు
డ్యాన్స్పై ఆసక్తి పెరిగింది
చేతిరాత మెరుగుపరుచుకోవడం, డ్యాన్స్ నేర్చుకోవడం వలన భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతుంది. డ్యాన్స్ మాస్టర్ కూడా మాకు ఆసక్తి కలిగేలా ఎంతో ఓర్పుతో నేర్పిస్తున్నారు.
– కె. అక్షర, 6వ తరగతి, మోడల్ స్కూల్
ఇండోర్ గేమ్స్ బాగున్నాయి
వేసవి శిబిరంలో స్నేహితులతో కలిసి చెస్, క్యారమ్స్ ఆడటం బాగుంది. ఉదయం ఆటలు ఆడటంతో పాటు స్నేహితులను నిత్యం కలిసి కొత్త విషయాలు తెలుసుకొనే అవకాశం ఉంది.
– ఈ. ప్రవీణ్కుమార్, 8వ తరగతి, నిడమనూరు
అమ్మమ్మ చెప్పిన నీతి కథ
అనగనగా ఒక ఊర్లో ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారి పేర్లు వెంకట్ సాయి, శివ. వీళ్లిద్దరి ఇళ్లు పక్కపక్కనే ఉండేవి. శివ వాళ్ల నాన్న వ్యవసాయం చేసేవాడు. అమ్మ కూలీ పనికి వెళ్లేది. వెంకట్ సాయి వాళ్ల తల్లిదండ్రులు బేకరీ నడిపేవారు. ఒకరోజు శివ దొంగతనం చేశాడు. అది చూసిన వెంకట్ సాయి దొంగతన చేయడం తప్పని శివకు చెప్పాడు. కానీ శివ పట్టించుకోలేదు. ఆ తర్వాత మరోసారి శివ దొంగతనం చేస్తూ దొరికిపోయాడు. అప్పుడు శివకు అర్ధమైంది వెంకట్ సాయి తన మంచికే చెప్పాడని అర్ధం చేసుకున్నాడు.
స్టాలిన్, దామరచర్ల


