రోడ్డు ప్రమాదంలో ఎంబీబీఎస్‌ విద్యార్థి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఎంబీబీఎస్‌ విద్యార్థి మృతి

May 18 2026 9:55 AM | Updated on May 18 2026 9:55 AM

ఆలేరు : రోడ్డు ప్రమాదంలో మెడికల్‌ విద్యార్థి దుర్మరణం చెందగా.. ఇద్దరు బీటెక్‌ విద్యార్థులు తీవ్ర గాయాలపాలయ్యారు. ఇద్దరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆలేరు నివాసం ఉంటున్న పీఆర్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గడసంతల మధుసూదన్‌–సరళ (ప్రభుత్వ టీచర్‌) దంపతుల కుమారుడు శ్రీసాహిత్‌(19) సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అదేవిధంగా ఆలేరుకు చెందిన బీజేపీ నాయకుడు పులిపలుపుల మహేష్‌ కొడుకు రాఘవ జనగాంలో బీటెక్‌ ద్వితీయ సంవత్సరం, కొండోజు అక్షయ్‌ బీటెక్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు. వీరు ముగ్గురు స్నేహితులు.

ఇంటికి బయలుదేరినట్టు తల్లిదండ్రులకు మేసేజ్‌..

శనివారం శ్రీసాహిత్‌ కళాశాలలో జరిగిన పరీక్షలకు హాజరయ్యాడు. అదేరోజు తల్లిదండ్రుల వివాహ వార్షికోత్సం ఉండడం, ఆదివారం సెలవు రావడంతో శ్రీసాహిత్‌ ఆలేరులోని ఇంటికి వెళ్లాలనుకున్నాడు. తల్లిదండ్రులు కారు పంపిస్తామన్నా బస్సులో వస్తానని వారితో చెప్పాడు. అనంతరం ఆలేరు నుంచి తన స్నేహితులు రాఘవ, అక్షయ్‌ స్కూటీపై సిద్దిపేటలోని సాహిత్‌ వద్దకు వెళ్లారు. సిద్దిపేట నుంచి సాయంత్రం శ్రీసాహిత్‌, రాఘవ, భార్గవ్‌లు ముగ్గురు స్కూటీపై ఆలేరుకు బయలుదేరారు. సిద్దిపేట నుంచి బయలుదేరినట్టు శ్రీసాహిత్‌ తల్లిదండ్రులకు మేసెజ్‌ పంపించాడు. శనివారం రాత్రి చేర్యాల పట్టణ శివారులోని గుర్జకుంట వాగు దాటిన తర్వాత ఇండేన్‌ పెట్రోల్‌ బంక్‌ సమీపంలో సెంట్రల్‌ డివైడర్‌ ఢీకొట్టడంతో స్కూటీ అదుపు తప్పి ముగ్గురు రోడ్డుపై పడిపోయారు. శ్రీసాహిత్‌కు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందగా.. రాఘవ, అక్షయ్‌ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగ్రాతులను ఆస్పత్రికి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. గాయపడిన ఇద్దరిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. ఇందులో రాఘవ పరిస్థితి విషమంగా ఉండగా, అక్షయ్‌ కోలుకుంటున్నట్టు పోలీసుల తెలిపారు. శ్రీసాహిత్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతదేహాన్ని యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామానికి తరలించి అంత్యక్రియలు చేశారు.

నాటు సారా పట్టివేత

మోతె : మోతె మండల పరిధిలోని సర్వారం గ్రామ శివారులో ఆదివారం నాటు సారా, బెల్లం పానకం పట్టుబడింది. వివరాలు.. సర్వారం గ్రామ శివారులో ఎకై ్సజ్‌ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా బైక్‌పై 5 లీటర్ల నాటు సారాతోపాటు 100 లీటర్ల బెల్లం పానకం తరలిస్తున్న గుగులోతు జానిని అదుపులోకి తీసుకున్నారు. బైక్‌, బెల్లం పానకం, నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. జానిని రిమాండ్‌ నిమిత్తం ఎస్‌హెచ్‌ఓ సూర్యాపేటకు తరలించారు. తనిఖీల్లో ఎకై ్సజ్‌ సీఐ స్టివెన్‌సన్‌, ఎస్‌ఐ రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.

ఇద్దరు బీటెక్‌ విద్యార్థులకు తీవ్ర గాయాలు

అందులో ఒకరి పరిస్థితి విషమం

Advertisement
 
Advertisement
Advertisement