భువనగిరి (బీబీనగర్) : ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బీబీనగర్ మండలం చిన్నరావులపల్లి గ్రామంలో రైతులు రోడ్డుపై ధాన్యం పోసి బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాస్ మాట్లాడారు. అధికార పార్టీకి చెందిన నాయకులు ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఇష్టానుసారంగా వ్యవహరించడం తగదన్నారు. కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి 30 రోజులు కావస్తున్న కొనుగోలు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో చింతల సుదర్శన్రెడ్డి, పిట్టల అశోక్, రైతులు పురుషోత్తంరెడ్డి, శ్రీశైలం, రమేష్,బాల్రెడ్డి పాల్గొన్నారు.
రైతులను ఇబ్బంది పెట్టొద్దని ధర్నా
వలిగొండ : మండలంలోని ముద్దాపురం సమీపంలోని న్యూ బాలాజీ రైస్ మిల్లు యజమాని ధాన్యం దిగుమతిలో ఇబ్బంది పెట్టడాన్ని నిరసిస్తూ శనివారం అరూరు గ్రామ రైతులు వలిగొండ తొర్రూరు రోడ్డు ముద్దారం స్టేజి వద్ద ధాన్యం బస్తాలు వేసి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ అరూరు కొనుగోలు కేంద్రం నుంచి ధాన్యం లారీలు తరలించగా 4 రోజులుగా కొర్రీలు పెడుతూ 3, 4 కిలోలు కటింగ్ చేస్తేనే దిగుమతి చేసుకుంటామని మిల్లు యజమాని చెబుతున్నారని రైతులు వాపోయారు. ధర్నాలో జినుకల దానయ్య, ఆవుల స్వామీ, బండారు నర్సింహారెడ్డి, ఆలూరు కొండల్రెడ్డి, కోయగూర మధు, సామ రాంరెడ్డి, జక్కిడి జంగారెడ్డి, కశిరబోయిన మహేష్, కనకచారి, మహేద తదితరులు పాల్గొన్నారు.


