ఫ ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయాలి ఫ రైతు సంఘం నేతల డిమాండ్
చౌటుప్పల్ : కొనుగోలు కేంద్రాల్లో రైతులు రోజుల తరబడి పడిగాపులుకాస్తున్నా అధికారులు మాత్రం కాంటాలు వేయించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు బూరుగు కృష్ణారెడ్డి ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వీడి వేగంగా తూకాలు వేయాలని, అకాల వర్షాల కారణంగా కొనుగోలు కేంద్రాలలో తడిసిన ధాన్యాన్ని ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం, రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ యార్డు ఎదురుగా జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూతూకాలు వేసిన ధాన్యం బస్తాలను సకాలంలో ఎగుమతి కూడా చేయడంలేదన్నారు. మిల్లుల వద్ద దిగుమతి చేసుకునే సమయంలో తరుగు పేరిట అధనంగా రైతులపై భారం మోపుతున్నారని ఆరోపించారు. అకాల వర్షం కారణంగా కొనుగోలు కేంద్రాలలో తడిసిన ధాన్యాన్ని ఎలాంటి కొర్రీలు పెట్టకుండా పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు చీరిక అలివేలు, ఎండి.పాష, గోశిక కరుణాకర్, బండారు నర్సింహ, ఆకుల ధర్మయ్య, పర్నె ధర్మారెడ్డి, బొడ్డు అంజిరెడ్డి, పొట్ట శ్రీను, బొజ్జ బాలయ్య, జక్కిడి గోపాల్రెడ్డి, అంజిరెడ్డి, చీరిక సంజీవరెడ్డి, కృష్ణారెడ్డి, లింగయ్య, కృష్ణ, శ్రీనివాస్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


