యాదగిరిగుట్ట: ప్రజా ప్రభుత్వంలో అర్హత కలిగిన ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందుతాయని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పేర్కొన్నారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డులో నూతన ఇందిరమ్మ ఇంటి ప్రారంభోత్సవంలో సోమవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత గూడులేని ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం నిర్మించి ఇస్తుందన్నారు. పేద, ధనిక అనే తేడా లేకుండా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మంచి గృహం ఉండాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ పథకాన్ని తీసుకువచ్చామన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వలేదని, కానీ ప్రజా ప్రభుత్వంలో సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో అర్హులైన అందరికి ఇందిరమ్మ ఇళ్లను ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గుండ్లపల్లి వాణి, వైస్ చైర్పర్సన్ బరిగె రమ్య, కౌన్సిలర్లు కాటబత్తిని స్వప్న, ముక్కెర్ల మల్లేష్, బూడిద మధు తదితరులు పాల్గొన్నారు.
ఫ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య


