దేవరకొండ : ట్రాక్టర్ను కారు ఢీకొనడంతో ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన దేవరకొండ మండలం కొండభీమనపల్లి శివారులో సోమవారం జరిగింది. సీఐ వెంకట్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. దేవరకొండ మండలం తూర్పుపల్లి నుంచి కొండభీమనపల్లి ఽకొనుగోలు కేంద్రానికి ధాన్యం లోడుతో వస్తున్న ట్రాక్టర్ను కొండభీమనపల్లి శివారులో వెనుక నుంచి వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న వెంకన్న, శివ, అర్జున్, వేణు, ఆనంద్కు గాయాలయ్యాయి. వీరు డిండి మండలం కందుకూర్లో పెళ్లికి హాజరై తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను స్థానికులు దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు హైదరాబాద్కు తీసుకెళ్లారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందలేదని సీఐ తెలిపారు.
సాగర్ బ్యాక్ వాటర్లో మునిగి యువకుడి మృతి
చందంపేట : నేరెడుగొమ్ము మండలంలోని వైజాగ్ కాలనీ వద్ద సాగర్ బ్యాక్ వాటర్లో మునిగి యువకుడు మృతిచెందాడు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం పల్లెర్ల గ్రామానికి చెందిన వంగపల్లి గిరిబాబు (28) ఆదివారం తన ముగ్గురు స్నేహితులతో కలిసి నేరెడుగొమ్ము మండలంలోని వైజాగ్ కాలనీకి వచ్చాడు. ఈ క్రమంలో సాగర్ బ్యాక్ వాటర్లో స్నానం చేస్తుండగా గిరిబాబు కాలు జారి నీటి గుంతలో పడి మృతిచెందాడు. మృతుడు హైదరాబాద్లో కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. సోమవారం మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నాగేంద్రబాబు తెలిపారు.
చెరువులో మునిగి..
పెన్పహాడ్ : చెరువులో మునిగి వృద్ధుడు మృతిచెందాడు. ఈ ఘటన పెన్పహాడ్ మండలం లింగాలలో సోమవారం జరిగింది. లింగాల గ్రామానికి చెందిన గార్లపాటి సత్యనారాయణరెడ్డి(75) పాడి గేదెలు వారం క్రితం తప్పిపోయాయి. వాటిని వెతికే క్రమంలో గ్రామ శివారులోని ఎర్ర చెరువు వద్దకు వెళ్లిన అతడు చెరువు నీటిలోకి దిగి అప్పటికే అందులో ఉన్న గేదెలను బయటకు వెళ్లగొడుతుండగా.. ప్రమాదవశాత్తు నీట మునిగాడు. అక్కడే చెరువు కట్టపై ఉన్న తన మనుమడు మిర్యాల అరవింద్ చూసి గ్రామస్తులకు సమాచారం అందించాడు. గ్రామస్తులు వచ్చి సత్యనారాయణరెడ్డి మృతదేహాన్ని చెరువు నుంచి బయటకు తీశారు. మృతుడి కుమారుడు గార్లపాటి లచ్చిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేటకు తరలించినట్లు ఏఎస్ఐ రాములు తెలిపారు.


