చిట్యాల : విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ శివారులో సోమవారం డీజిల్ ట్యాంకర్, కారు ఒకదానికొకటి ఢీకొని బోల్తా పడ్డాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్కట్పల్లి వైపు నుంచి హైదరాబాద్కు వెళ్తున్న డీజిల్ ట్యాంకర్ను చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ శివారులోని ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో వెనుక నుంచి వస్తున్న కారు ఓవర్టేక్ చేయబోయి ఢీకొని అదుపుతప్పి హైవే పక్కన గల డివైడర్ను కూడా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీజిల్ ట్యాంకర్, కారు హైవేపై అడ్డంగా బోల్తా పడ్డాయి. కారులో ఏపీలోని నెల్లూరు నుంచి సంగారెడ్డికి వెళ్తున్న ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనతో హైవేపై భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని హైవేపై అడ్డంగా పడిపోయిన వాహనాలను క్రేన్ల సహాయంతో పక్కకు తొలగించారు.
ఫ ఇద్దరికి స్వల్ప గాయాలు


