నకిరేకల్ : వివాహానికి వెళ్లొస్తూ రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన నకిరేకల్ మండలం తాటికల్ గ్రామంలో శనివారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నకిరేకల్ మండలం తాటికల్ గ్రామానికి చెందిన అన్నెం ఆర్య(20) శనివారం శాలిగౌరారం మండలం మనిమద్దె గ్రామంలో తన స్నేహితుడి పెళ్లికి హాజరయ్యాడు. అర్ధరాత్రి తిరిగి తన స్వగ్రామానికి బైక్పై వస్తుండగా.. మార్గమధ్యలో నకిరేకల్–తాటికల్ మధ్యలో 565వ నంబర్ జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆర్య అక్కడికక్కడే మృతిచెందాడు. ఆర్య ఇటీవలే ఇంటర్మీడియట్ పూర్తిచేసినట్లు సమాచారం. ఆదివారం మృతుడి తండ్రి కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ హరిబాబు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం


