భువనగిరిటౌన్ : జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం ఉదయం 8:30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మోస్తరు నుంచి తేలికపాటి వర్షం కురిసింది. తెలంగాణ అభివృద్ధి ప్రణాళికా సంఘం వెల్లడించిన గణాంకాల ప్రకారం.. జిల్లాలో అత్యధికంగా చౌటుప్పల్ మండల కేంద్రంలో 16.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే నారాయణపూర్ మండలంలో 12.0 మి.మీ, వలిగొండ మండలం వర్కట్పల్లిలో 8.8 మి.మీ, ఆలేరు మండలం శరాజ్పేటలో 7.3 మి.మీ వర్షం కురిసింది. అదేవిధంగా వలిగొండలో 5.8 మి.మీ, మోటకొండూర్లో 4.3 మి.మీ, ఆలేరు మండలం గొల్లంకొండలో 0.5 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. చౌటుప్పల్లో మోస్తరు వర్షం కురవగా.. మిగిలిన మండలాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి.
టెర్మినల్ ప్రారంభోత్సవం..
వీక్షించిన ఉద్యోగులు
చౌటుప్పల్ : చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామంలో రూ.611 కోట్ల వ్యయంతో నిర్మించిన ఐవోసీఎల్ టెర్మినల్ను ఆదివారం హైదరాబాద్ నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్గా ప్రారంభించి జాతికి అంకితం ఇచ్చారు. ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని మల్కాపురంలోని టెర్మినల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఉన్నతాధికారులు, ఉద్యోగులు, సిబ్బంది వేడుకలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్క్రీన్పై వీక్షించారు. కార్యక్రమంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల సీజీఎం టీకే ఎలమరన్, సీజీఎం ఆపరేషన్ సూరజ్కుమార్ పట్నాయక్, వివిధ విభాగాలకు చెందిన జీఎంలు అందె గణేశ్చక్రవర్తి, శ్రీహరినాథ్, హేమంతబైష్య, పాపిని కిరణ్కుమార్, శ్రీకాంత్, రాజశేఖర్, మల్కాపురం సర్పంచ్ గిర్కటి నిరంజన్, ఉద్యోగులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు,
ధాన్యం దిగుమతిపై
దృష్టిసారించాం
చౌటుప్పల్ : కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని దిగుమతి చేసుకునే అంశంపై ప్రధానంగా దృష్టి సారించామని అదనపు కలెక్టర్ వెంకారెడ్డి తెలిపారు. చౌటుప్పల్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ఆయన సందర్శించి మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేయగా ఇప్పటివరకు జిల్లాలో 358 కొనుగోలు కేంద్రాల ద్వారా 1.05 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్లు వేగంగా జరగడం లేదని అదనపు కలెక్టర్కు రైతులు విన్నవించారు. కొనుగోలు కేంద్రాల్లో హమాలీ చార్జీలు క్వింటాలుకు రూ.40 ఉండగా చౌటుప్పల్ మార్కెట్లో రూ.42 వసూలు చేస్తున్నారని తమ గోడు వెళ్లబోసుకున్నారు. స్పందించిన అదనపు కలెక్టర్.. హమాలీ చార్జీలు అదనంగా తీసుకోవద్దని నిర్వాహకులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీఓ వెల్మ శేఖర్రెడ్డి, మార్కెట్ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, మున్సి పల్ చైర్పర్సన్ మొగుదాల పావని మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ వినయ్కుమార్, తహసీల్దార్ వీరాబాయి, ఏవో నాగరాజు పాల్గొన్నారు.


