భూసార పరీక్షలకు అనువైన సమయమిదే.. | - | Sakshi
Sakshi News home page

భూసార పరీక్షలకు అనువైన సమయమిదే..

May 8 2026 9:50 AM | Updated on May 8 2026 9:50 AM

ఉపయోగాలు ఇవీ..

ఫ పొలంలో పోషకాల స్థాయి తెలుస్తుంది.

ఫ ఆ పొలంలో ఏయే పంటలు పండించవచ్చో తెలుస్తుంది.

ఫ ఎరువులు ఎంత మోతాదులో, ఎప్పుడు వేయాలో తెలుస్తుంది.

ఫ నేలల సమస్యలు తెలుస్తాయి. దాని ప్రకారం ఎరువులను ఉపయోగించవచ్చు.

ఫ ఎరువుల అనవసరపు ఖర్చు తగ్గించవచ్చు.

సరైన సమయంలో భూసార పరీక్షలు చేయిస్తే సేంద్రియ ఎరువులను కూడా ఉపయోగించి నాణ్యమైన పంటలను పండించవచ్చు.

నడిగూడెం : ప్రస్తుతం యాసంగి సీజన్‌ పూర్తయింది. వరి, ఇతర ఏ పంటలు కూడా సాగులో లేవు. ఈ పంటలు లేని సమయంలోనే మట్టి నమూనాలు తీసి, వాటిని పరీక్ష చేయించాలి. వాటి ఫలితాల ఆధారంగా ఎరువులను ఉపయోగించాలి. భూసార పరీక్షలకు అనువైన సమయమిదేనని గడ్డిపల్లి కేవీకే మృత్తికా విభాగం శాస్త్రవేత్త ఎ.కిరణ్‌ చెబుతున్న సలహాలు, సూచనలు ఆయన మాటల్లోనే..

భూసార పరీక్ష అంటే..

పొలం నుంచి సేకరించిన మట్టిని వివిధ భౌతిక, రసాయన పద్ధతుల ద్వారా విశ్లేషించి, దాని ఫలితాల ఆధారంగా ఎంత మోతాదులో ఎరువులను వాడాలో తెలుసుకోవడమే భూసార పరీక్ష.

మట్టి నమూనాలు తీసే సమయం..

ఫ పంట కోత తర్వాత తీయవచ్చు.

ఫ వేసవిలో పంటలు లేని సమయంలో తీయవచ్చు.

మట్టి నమూనాలు తీయకూడని

ప్రదేశాలు–సమయాలు..

ఫ ఎరువులు వేసిన తర్వాత నెల రోజుల వరకు సమూనా తీయరాదు.

ఫ నీరు పెట్టిన తరువాత తీయరాదు

ఫ నీడపడే ప్రదేశాలు, నీటి ముంపు ప్రాంతాలు, పెంటకుప్పల దగ్గర, గట్లు, చెట్లు, రోడ్ల దగ్గర తీయరాదు.

మట్టి నమూనాలు తీయాల్సిన విస్తీర్ణం

ఒక రకం పొలానికి ఒక నమూనా తీయాలి. పొలం మరీ పెద్దయితే ప్రతి ఐదు ఎకరాల్లో నమూనా తీయాలి. నేల నిర్మాణం, రంగు, మురుగు, పారుదల సౌకర్యం, నేల వాలు, చౌడు, క్షార, గుణాలు, పంటల సరళి విషయాల్లో ఏవేనా తేడా కనిపిస్తే అన్ని నమూనాలు ఆ పొలం నుంచి తీయాల్సి ఉంటుంది.

నమూనాలు సేకరించాల్సిన లోతు

ఫ పైరు పంటలకు 6 అంగుళాలు

ఫ పండ్ల తోటల్లో 5 నుంచి 6 అడుగుల వరకు ప్రతి అడుగుకు ఒక నమూనా

ఫ కారి, చౌడు, ఆమ్ల నేలలకు–అడుగు లోతులో ప్రతి 6 అంగుళాలకు ఒక నమూనా తీయాలి.

నమూనాలు ఎలా సేకరించాలి..

ఫ నేలపై ఉన్న గడ్డి, చెత్త, కలుపు తీసివేయాలి.

ఫ గొయ్యి అంచుల నుంచి పారతో గానీ, తాపీతో గానీ మట్టిని సేకరించాలి.

ఫ పొలంలో 8 నుంచి 10 స్థలాల్లో ఈ పద్ధతిలో మట్టిని సేకరించాలి.

ఫ సేకరించిన మట్టినంతటిని కలిపి నేలపై పరిచి దానిని 4 భాగాలు చేయాలి. మూలలకు ఎదురెదురుగా ఉన్న భాగాల మట్టిని తీసుకుని మిగిలిన మట్టిని పారవేయాలి ఈ విధంగా 500 గ్రాముల నమూనాలను సేకరించాలి.

ఫ ఈ అరకేజీ మట్టిని గుడ్డ సంచిలో గానీ, పాలిథిన్‌ సంచిలో గానీ వేసి, రైతు పేరు, చిరునామా, సర్వే నంబరు, పొలం విస్తీర్ణం, మెట్ట, పల్లం, ఆరుతడి పంటలు, గత 3 సంవత్సరాలుగా వాడుతున్న ఎరువులు, రాబోయే సీజన్‌లో వేయాల్సిన పంటలు, సేకరించిన తేదీ వివరాలను జతచేయాలి. సమాచార పత్రంతో కూడిన మట్టి నమూనాలను సంబంధిత వ్యవసాయ అధికారులకు లేదా భూసార పరీక్ష కేంద్రానికి పంపాలి. లేదా గడ్డిపల్లి కేవీకేకు పంపించినా పరీక్షలు చేసి, సాయిల్‌ హెల్త్‌కార్డు పంపిణీ చేస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement