భువనగిరి : విద్యార్థుల కోసం కేటాయించిన స్కూల్ బస్సులను ఇతర అవసరాలకు వినియోగిస్తున్న యాజమాన్యాలపై జిల్లా రవాణా శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. స్కూల్ బస్సులను పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు అద్దెకు పంపిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై జిల్లా రవాణా అధికారి సాయికృష్ణ ఆదేశాల మేరకు అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మక్తానంతారం వద్ద నిర్వహించిన తనిఖీల్లో బీబీనగర్కు చెందిన మహర్షి హైస్కూల్, చౌటుప్పల్కు చెందిన త్రినిటి స్కూల్ బస్సులను నిబంధనలకు విరుద్ధంగా వాడుతున్నట్లు గుర్తించి అధికారులు కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎంవీఐలు శ్రీహర్షారెడ్డి, ప్రణీత్రెడ్డి మాట్లాడుతూ స్కూల్ బస్సులను కేవలం విద్యార్థుల రవాణాకే వాడాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.. కాగా ట్రావెల్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల వెంకట్ జంగారెడ్డి ఆధ్వర్యంలో డీటీఓకు ఫిర్యాదు చేయడంతో దాడులు నిర్వహించారు. ఫిర్యాదు చేసిన వారిలో జిల్లా కార్యదర్శి అంబటి సుధాకర్, పన్నాల మల్లారెడ్డి తదితరులు ఉన్నారు.


