నకిరేకల్ : మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్కు అధికారం పోయినా అహంకారం తగ్గలేదని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నకిరేకల్లోని తన నివాసంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని ఉద్ధేశించి కేటీఆర్ మాట్లాడిన మాటలు చూస్తుంటే ఆయనకు ఒంటి నిండా ఎంత అహంకారం ఉందో అర్థమవుతుందన్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిపై నోటికొచ్చినట్లు అనుచిత వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నారు. పాలనకు పనికిరారని ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టినా బీఆర్ఎస్ నాయకులకు అహంకారం తగ్గలేదన్నారు. వరంగల్లో శృతిని ఎన్కౌంటర్ చేయించింది మీరు కాదా.. వరి వేస్తే ఉరి అని చెప్పింది మీరు కాదా.. రుణమాఫీ చేస్తామని రైతుల్ని మోసం చేసంది మీరా కాదా అని ప్రశ్నించారు. ఈ రాష్ట్రాన్ని దోచుకుతిన్న కేసీఆర్ కుటుంబం దొర అహంకారాన్ని తెలంగాణ సమాజం ఎప్పుడూ క్షమించదన్నారు. కేంద్రంలో బీజేపీ తీసుకొచ్చిన ప్రతి నల్ల చట్టం వెనుక బీఆర్ఎస్ హస్తం ఉందని విమర్శించారు. ఈ సమావేశంలో నాయకులు పన్నాల రాఘవరెడ్డి, లింగాల వెంకన్న, చౌగోని శ్రీనివాస్, నంద్యాల వెంకట్రెడ్డి, లతీఫ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ విప్, నకిరేకల్
ఎమ్మెల్యే వేముల వీరేశం


