కాలువ తవ్వింది లేదు.. నీరు పారిందిలేదు! | - | Sakshi
Sakshi News home page

కాలువ తవ్వింది లేదు.. నీరు పారిందిలేదు!

May 1 2026 8:02 AM | Updated on May 1 2026 8:02 AM

పదేళ్లుగా రైతుబంధు రావడంలేదు

పరిహారం ఇప్పించాలి

కలగానే.. కాళేశ్వరం ప్యాకేజీ–15 కాలువ నిర్మాణం

అధికారులు సేకరించిన భూమి, ఇవ్వాల్సిన పరిహారం

గ్రామం అవార్డు పాసైనభూమి పరిహారం

(ఎకరాల్లో) (రూ.లలో)

చల్లూరు 56.29 3,56,71,026

బేగంపేట 71.34 5, 16,83,651

జాల 13.36 14,04,231

బొందుగుల 32.32 1,72,22,869

నర్సాపూర్‌ 55.13 3,45, 69,481

రఘునాథ్‌పూర్‌ 24.32 1,67,65,079

కుర్రారం 46.295 2,97,72,974

298.06 ఎకరాల భూ సేకరణ

60 మంది రైతులకు అందని పరిహారం

పదమూడేళ్లుగా నిరీక్షణ

సాక్షి, యాదాద్రి : కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ–15 కింద కాలువ నిర్మాణ పనులు ముందుకు సాగడంలేదు. రాజాపేట మండలంలో సుమారు 15 నుంచి 20 కిలోమీటర్ల వరకు కాలువ తవ్వకానికి అవసరమైన భూములను రైతుల నుంచి సేకరించిన అధికారులు భూ భారతి పోర్టల్‌లో నమోదు చేసి కొన్నిచోట్ల పనులు ప్రారంభించి వదిలేశారు. మరికొన్ని గ్రామాల్లో అసలు పనులే మొదలు పెట్టలేదు. గంధమల్ల రిజర్వాయర్‌ను పెండింగ్‌లో పెట్టడం.. నిధులలేమి కారణంగా ఈ కాలువ నిర్మాణం కలగానే మిగిలింది. అటు సాగునీరు అందక, ఇటు భూమి పరిహారం రాక రైతుల బతుకు భారంగా మారింది

అందని రూ.19.70కోట్ల పరిహారం

రాజాపేట మండల పరిధిలోని రైతులకు గోదావరి జలాలు అందించి బీడుభూములను సాగులోకి తేవాలనే లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ–15 కింద గంధమల్ల రిజర్వాయర్‌కు అనుబంధంగా కాలువ నిర్మాణ పనులు చేపట్టాలనుకున్నారు. దీనికోసం 13 ఏళ్ల క్రితం గంధమల్ల నుంచి రఘునాథపురం గ్రామం వరకు దాదాపు ఏడు గ్రామాల్లో మొత్తం 308.24 ఎకరాల భూమిని సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇందులో 60 మంది రైతుల నుంచి ఇప్పటి వరకు 298.06 ఎకరాల భూమిని మాత్రమే సేకరించింది. అయితే ఆ భూములకు సంబంధించిన రైతులకు రూ.19.70 కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉన్నా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.

ఆ భూములు నిషేధిత జాబితాలోకి..

అధికారికంగా భూ సేకరణ ప్రక్రియ పూర్తిచేసిన యంత్రాంగం ఆయా భూములను నిషేధిత జాబితాలో చేర్చింది. దీంతో రైతులు భూమి మీద హక్కులు కోల్పోయారు. ఆ భూములకు గత ప్రభుత్వంలో రైతుబంధు, ప్రస్తుత ప్రభుత్వంలో రైతు భరోసా దక్కడంలేదు. తమ పిల్లల చదువులు, వివాహాలు, ఇతర అత్యవసరం కోసం అమ్ముకుందామంటే వీలులేకుండా పోయిందని నిర్వాసిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

భూములను ఆధీనంలోకి తీసుకున్నా..

కాళేశ్వరం కాలువ నిర్మాణం కోసం రైతుల భూముల ను తమ ఆధీనంలోకి తీసుకున్న ప్రభుత్వం పనులు మాత్రం ఇంత వరకు ప్రారంభించలేదు. బీడు భూములకు గోదావరి జలాలు వస్తాయని ధీమా కూ డా లేకుండా పోయింది. కాలువ నిర్మాణం పూర్తయితే దానిద్వారా వచ్చే నీటితో భూములను సాగులోకి తెచ్చుకుంటామని ఎదురుచూస్తున్న తమ ఆశలు అడియాసలుగా మారాయని రైతులు పేర్కొంటున్నారు.

కాళేశ్వరం ప్యాకేజీ–15 కింద కాలువ నిర్మాణానికి తీసుకున్న భూములకు నష్టపరిహారం ఇవ్వాలి. రైతుల నుంచి భూములను తీసుకున్న ప్రభుత్వం పరిహారం ఇవ్వకుండా అన్యాయం చేస్తోంది. పదేళ్లుగా రైతులకు రైతు బంధు రావడంలేదు. న్యాయం చేయాలి.

– వంచ వీరారెడ్డి, మాజీ సర్పంచ్‌, చల్లూరు

సేకరించాల్సిన భూమి 308.24 ఎకరాలు

సేకరించింది 298.06 ఎకరాలు

బాధిత రైతులు సుమారు 60 మంది

చెల్లించాల్సిన పరిహారం: రూ. 19.70 కోట్లు

నాకున్న ఎకరన్నర భూమిలో అరెకరం భూమి కాలువ కిందపోయింది. పరిహారం మాత్రం రాలేదు. ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోవడంలేదు. కొడుకు పెళ్లి కోసం భూమిని అమ్ముదామంటే అవకాశం లేకుండాపోయింది. పరిహారం ఇప్పించాలి.

– వర్కాల చంద్రయ్య, చల్లూరు రైతు

Advertisement
 
Advertisement
Advertisement