ఎరువుల ధరల వివరాలు
ఎరువుల రకం పాత ధర కొత్త ధర
(50 కిలోలు) (రూ.లో) (రూ .లో)
20–20–013 1500 1800
16–20–013 1400 1750
14–35–14 2150 2350
15–15–15–09 1650 1950
10–23–26 1950 2025
సింగిల్ సూపర్ పాస్పేట్ 615 775
పొటాష్ 1850 1975
16–16–16 1675 2050
24–24–0 2000 2300
భువనగిరి: యాసంగి సీజన్ ముగింపు దశకు వస్తోంది. వానాకాలం సాగుకు రైతులు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఎరువుల కంపెనీలు మాత్రం అదును చూసి ఎరువుల ధరలను పెంచాయి. ఈ మేరకు డీలర్లకు ఆయా కంపెనీల ప్రతినిధులు సమాచారం ఇచ్చారు. దీంతో జిల్లాలోని రైతులపై ఆర్థిక భారం పడనుంది. ఎరువుల రకాలను బట్టి రూ. 75 నుంచి రూ. 350 వరకు ధరలు పెరగడం గమనార్హం. పశ్చిమాసియా దేశాలలో జరుగుతున్న యుద్ధ ప్రభావంతో ఎరువుల తయారీకి వాడే ముడిసరకుల ధరలు పెరిగాయి. సరకును రవాణ చేసే నౌకలకు బీమా సంస్థలు విధించే ప్రీమియం ఇతర పనులు ఎక్కువ కావడంతో ఎరువుల ధరలు పెంచామని కంపెనీ సంస్థలు చెబుతున్నాయి.
రూ.300లకు..
యాసంగిలోనే రైతులకు సకాలంలోనే యూరియా దొరక్కపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎరువులను అధికంగా వాడుతున్నారని యాప్ను తీసుకురావడంతో ఇప్పటికీ ఇబ్బందులు తొలగలేదు. బస్తా డీఏపీ వాస్తవ ధర రూ. 1,350 ఉంటే గిట్టుబాటు కావడం లేదని గతేడాది డీలర్లు విక్రయించేందుకు ఆసక్తి చూపలేదు. బస్తా యూరియా నిర్ణీత ధర రూ. 265లు ఉండగా ఇప్పటికీ రూ. 300లకు విక్రయిస్తారు.
రెండు సీజన్లకు 4.80లక్షల టన్నుల ఎరువులు
గ్రామాలలో పశు సంపద తగ్గిపోవడం సేంద్రియ ఎరువులు లేకపోవడంతో పంటలకు పోషకాలను అందించేందుకు రసాయన ఎరువుల వాడకం తప్పనిసరి అవుతుంది. జిల్లాలో వానాకాలం సాధారణ సాగు 4.75 లక్షల ఎకరాలు ఉండగా సుమారు 2 లక్షల వరకు రైతులు ఉన్నారు. జిల్లాలో ప్రధానంగా వరి, పత్తి, కంది, పెసర, జొన్న వంటి పంటలను సాగుచేస్తున్నారు. రెండు సీజన్లకు గాను 4. 80 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను ఉపయోగించనున్నారు. దీని ప్రకారం జిల్లా రైతుల పై సుమారు రూ. 10కోట్ల వరకు భారం పడనుంది.
ఫ వానాకాలం సాగు వేళ పెరిగిన ఎరువుల ధరలు
ఫ బెంబేలెత్తుతున్న రైతాంగం
ఫ జిల్లా రైతుపై రూ.10కోట్ల భారం


