సాక్షి, యాదాద్రి : పెట్రోల్, డీజిల్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ప్రజలు వదంతులు నమ్మి ఆందోళన చెందవద్దని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం యాదాద్రి భువనగిరి కలెక్టరేట్లో పెట్రోలియం సంస్థల సేల్స్ అధికారులు, పెట్రోల్ బంకుల నిర్వాహకులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించి మాట్లాడారు.డీడీ కట్టిన బంకు యజమానులకు వెంటనే ఆయిల్ సరఫరా చేయాలని కంపెనీ ప్రతినిధులను ఆదేశించారు. ప్రస్తుతం జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా జరుగుతున్న నేపథ్యంలో రైతులు, రవాణా వాహనాలు, హార్వెస్టర్లకు ఇంధన కొరత లేకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అత్యవసర సేవ వాహనాలు, నిత్యావసర సరుకుల రవాణాకు ఎలాంటి అంతరాయం కలగకుండా తగినంత నిల్వలు అందుబాటులో ఉంచాలన్నారు. ప్రజలు అవసరానికి మించి ఇంధనాన్ని కొనుగోలు చేయవద్దని కోరారు. ఈ సమావేశంలో ఆర్డీఓ కృష్ణారెడ్డి, జిల్లా పౌరసరఫరాల అధికారి రోజా రాణి పాల్గొన్నారు.
ఫ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి


