సాక్షి, యాదాద్రి : జనగణన–2027 ప్రక్రియలో భాగంగా ఆదివారం నుంచి స్వీయ గణనకు అవకాశం కల్పించినట్లు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. శనివారం యాదాద్రి భువనగిరి కలెక్టరేట్లోని తన చాంబర్లో అదనపు కలెక్టర్ వెంకారెడ్డితో విలేకరులో మాట్లాడారు. దేశ భవిష్యత్తు ప్రణాళికలకు, సంక్షేమ పథకాల రూపకల్పనకు జనగణన ప్రాతిపదిక అని, ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
రెండు విడతలుగా గణన ప్రక్రియ
జనగణన కార్యక్రమాన్ని అత్యంత పకడ్బందీగా రెండు విడతల్లో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. మొదటి విడత మే 11 నుంచి జూన్ 9 వరకు ఎన్యుమరేటర్లు ఇంటింటికీ తిరిగి గృహగణన చేస్తారని రెండవ విడత జనాభా లెక్కల సేకరణ ప్రక్రియను చేపడతారని తెలిపారు. డిజిటల్ సాంకేతికతను జోడించి, తప్పులకు తావులేకుండా నాణ్యమైన గణాంకాలను సేకరించడమే లక్ష్యంగా యంత్రాంగం పనిచేస్తోందన్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే ప్రతి సంక్షేమ పథకం, అభివృద్ధి కార్యక్రమం జనాభా లెక్కల ఆధారంగానే రూపొందుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు.
స్వీయ గణన ఇలా..
ఆదివారం నుంచి మే 10వ తేదీ వరకు ప్రజలు తమంతట తాము వివరాలను నమోదు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. ప్రజలు httpr://sc.census.gov.in పోర్టల్లోకి వెళ్లి వివరాలు సమర్పించవచ్చని సూచించారు. ఆన్లైన్లో నమోదు పూర్తయ్యాక ఒక ప్రత్యేక ఐడీ జనరేట్ అవుతుందన్నారు. తర్వాత అధికారులు ఇంటికి వచ్చినప్పుడు, వారికి ఈ ఐడీని చూపిస్తే సరిపోతుందన్నారు. దీనివల్ల సమయం ఆదా అవడమే కాకుండా గోప్యత కూడా ఉంటుందన్నారు. దీనిపై ప్రజా ప్రతినిధులు, స్వయం సహాయక సంఘాలు, యువత, ప్రభుత్వ ఉద్యోగుల సహకారంతో విస్తృత ప్రచారం చేయాలన్నారు.
ఫ ఆన్లైన్ పోర్టల్లో వివరాలు నమోదు చేసుకునే అవకాశం
ఫ మే 11 నుంచి క్షేత్రస్థాయిలో మొదటి విడత ఇళ్ల గణన
ఫ కలెక్టర్ అనురాగ్ జయంతి


