చౌటుప్పల్ : దేశంలో వ్యవసాయం తర్వాత అతి ముఖ్యమైన రంగంగా ఉన్న చేనేత పరిశ్రమను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని శాసన మండలి సభ్యుడు ఎల్.రమణ ఆరోపించారు. శుక్రవారం చౌటుప్పల్లో నిర్వహించిన ఉమ్మడి జిల్లా చేనేత హక్కుల సాధన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 10.40లక్షల మంది చేనేత రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని, మరమగ్గాలను చూసుకుంటే మరో లక్ష అదనంగా ఉంటారన్నారు. చేనేత సంక్షేమం కోసం గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలను యథావిధిగా అమలు చేయాలన్నారు. టెస్కో ద్వారానే చేనేత వస్త్రాలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. నేతన్నకు బీమాను కొనసాగించాలని కోరారు. చేనేత సమస్యలపై సీఎం, మంత్రులను కలుస్తామని తెలిపారు. మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ ఇరావత్రి అనిల్కుమార్ మాట్లాడుతూ.. రాజకీయాలకతీతంగా చేనేతలంతా ఒక్కటవ్వాలన్నారు. రాజకీయంగా ఎదిగేందుకు రాజ్యాధికారం దిశగా పయనించాలని పిలుపునిచ్చారు. చేనేత సమస్యల పరిష్కారానికి చేనేత హక్కుల సాధన వేదిక ముందుకు రావడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు, పోచంపల్లి మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశం, స్థానిక మున్సిపల్ వైస్చైర్మన్ గోశిక వినయ్కుమార్, నాయకులు ఎర్రమాద వెంకన్న, చిరందాసు ధనుంజయ్య, కర్నాటి వెంకటేశం, చిక్క నర్సింహ, కందగట్ల భిక్షపతి, పిల్లలమర్రి మదుసూధన్, రాపోలు వీరమోహన్, తడక నర్సింహ, నర్సింహ పాల్గొన్నారు.
ఫ శాసన మండలి సభ్యుడు ఎల్.రమణ


