యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయానికి వచ్చే భక్తులకు రక్షణ కల్పించడమే ప్రధాన ధ్యేయమని ఎస్పీఎఫ్ ఇన్స్పెక్టర్ శేషగిరిరావు అన్నారు. టీజీ ఎస్పీఎఫ్ డీజీ స్వాతిలక్రా ఆదేశాల మేరకు యాదగిరి దేవస్థానం ఆలయ భద్రతా విభాగం సిబ్బంది మంగళవారం కొండకు దిగువన ఉన్న తులసీ కాటేజీ నుంచి మల్లాపురం శివారు వరకు 10కే రన్ నిర్వహించారు. అనంతరం యోగా, వ్యాయామం చేశారు. ఎస్పీఎఫ్ ఇన్స్పెక్టర్ శేషగిరిరావు మాట్లాడుతూ.. భక్తులకు భద్రత కల్పించడం ఎంత ముఖ్యమో, భద్రత సిబ్బంది ఆరోగ్య, ఫిట్నెస్ కూడా అంతే ప్రధానమన్నారు. ఫిట్నెస్ కోసం సిబ్బంది వాకింగ్, రన్నింగ్, వ్యాయామం, యోగా వంటివి అలవాటు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ రవి, ఏఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.


