భువనగిరిటౌన్ : పొదుపు సంఘాల నిధులు కాజేసిన వారిపై అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని, లేకుంటే సోమవారం కలెక్టరేట్ ఎదుట పెద్దఎత్తున ధర్నా చేస్తామని భువనగిరి పట్టణ మహిళా సంఘాల సభ్యులు హెచ్చరించారు. మంగళవారం భువనగిరిలోని కెనరా బ్యాంకు ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత 20 ఏళ్లుగా తాము కష్టపడి పొదుపు చేసుకున్న డబ్బులు ఇప్పుడు ఖాతాల్లో కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సంతకాలను ఫోర్జరీ చేసి అక్రమంగా నిధులు డ్రా చేశారని ఆరోపించారు. దీనిపై సంఘబంధం నిర్వాహకులు పొంతనలేని సమాధానాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.


