జిల్లాలోని ఎంపిక చేసిన 96 కేంద్రాల్లో వాటర్ ప్లాంట్లు, పెయింటింగ్ పనుల కోసం సన్నాహాలు పూర్తయ్యాయి. ఈ పనులను మండల పరిషత్ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
– నర్సింహారావు, జిల్లా సంక్షేమాధికారి
భువనగిరిటౌన్: అంగన్వాడీ కేంద్రాల్లో చదివే చిన్నారులకు ఆరోగ్యం, ఆహ్లాదకరమైన వాతావరణం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘సాక్షమ్ అంగన్వాడీ – పోషణ్ 2.0’ కింద జిల్లాలోని ఎంపిక చేసిన కేంద్రాల ఆధునీకరణకు నిధులు మంజూరయ్యాయి. ఒక్కో కేంద్రానికి రూ.25వేల చొప్పున కేటాయించి, మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది.
96 కేంద్రాల్లో వాటర్ ప్లాంట్లు
జిల్లా వ్యాప్తంగా మొత్తం 901 అంగనన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. తొలి విడతగా 96 కేంద్రాల ఆధునీకరణ కోసం ఎంపిక చేశారు. ఈ కేంద్రాల్లో చిన్నారులకు కలుషితం లేని, స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు అత్యాధునిక నీటి శుద్ధి యంత్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే భువనగిరి మండలంలోని బస్వాపురం వంటి గ్రామాల్లో వాటర్ ట్యాంకుల నిర్మాణం ముమ్మరంగా సాగుతోంది.
ఆకర్షణీయంగా భవనాలు
కేంద్రాలకు వచ్చే చిన్నారులను ఆకట్టుకునేలా భవనాలకు రంగులు వేయించి, గోడలపై విద్యాపరమైన చిత్రాలు వేయిస్తున్నారు. ఇప్పటికే పెయింటింగ్ పూర్తయిన కేంద్రాల్లో ఆ నిధులతో చిన్నారుల కోసం నూతన ఆట వస్తువులను కొనుగోలు చేయాలని అధికారులు నిర్ణయించారు.
అమలవుతున్న పథకాలు
3 నెలల నుంచి మూడేళ్ల చిన్నారులకు నెలకు 16 కోడిగుడ్లు, 2.5 కిలోల బాలామృతం పంపిణీ, గర్భిణులు, బాలింతలకు ఒక పూట బలవర్ధకమైన భోజనం, చిన్నారుల కోసం కలర్ ఫుల్ కుర్చీలు, టేబుళ్లు, 8 రకాల కథల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. త్వరలో చిన్నారులకు ఉదయం వేళ పౌష్టిక అల్పాహారం అందించే తొలిముద్ద పథకం ప్రారంభం కానుంది.
ఫ ‘సాక్షమ్ అంగన్వాడీ – పోషణ్ 2.0’ కింద కేంద్రాల ఆధునీకరణ
ఫ ఒక్కో కేంద్రానికి రూ.25వేల చొప్పున కేటాయింపు


