భువనగిరి, సంస్థాన్ నారాయణపురం: సంస్థాన్ నారాయణపురం పోలీస్స్టేషన్లో హోంగార్డుగా పనిచేసిన వెంకటేశం 2025 డిసెంబర్ 7న చిట్యాల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. బాధిత కుటుంబానికి ఆక్సిస్ బ్యాంకు నుంచి మంజూరైన రూ.34లక్షలు డెత్ బీమా క్లెయిమ్ చెక్కును మంగళవారం భువనగిరిలోని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ అక్షాంశ్యాదవ్ అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ వినోద్కుమార్, ఆర్ఐ శ్రీనివాస్, ఆర్ఎస్ఐ స్వామి, ప్రవీణ్కుమార్ తదితరులున్నారు.
టెన్త్ పరీక్షకు 8,918 మంది హాజరు
భువనగిరి: జిల్లా వ్యాప్తంగా టెన్త్ పరీక్షలు కొనసాగుతున్నాయి. మంగళవారం జిల్లాలోని 50 కేంద్రాల్లో ఉదయం 9.30 నుంచి ఉదయం 11 గంటల వరకు జీవ శాస్త్రం పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు మొత్తం 8930 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా.. 8918 మంది హాజరయ్యారని, 12 మంది గైర్హాజరైనట్లు డీఈఓ సత్యనారాయణ తెలిపారు.
పరీక్ష కేంద్రాల తనిఖీ
తుర్కపల్లి: మండలంలోని పదో తరగతి పరీక్ష కేంద్రాలను మంగళవారం డీఈఓ సత్యనారాయణ తనిఖీ చేశారు. కేంద్రాల్లో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ప్రశ్నపత్రాల పంపిణీ విధానాన్ని పర్యవేక్షించారు. పరీక్షలు సజావుగా నిర్వహిస్తుండడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. పరీక్షల నిర్వహణలో పాల్గొంటున్న సిబ్బందికి పలు సూచనలు చేశారు. విద్యార్థులు ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలన్నారు. డీఈఓ వెంట తహసీల్దార్ రవికుమార్, ప్రధానోపాధ్యాయులు, ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బంది ఉన్నారు.
ఆరోగ్య వారోత్సవాలు ప్రారంభం
భువనగిరి: ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం ఆరోగ్య వారోత్సవాల నిర్వహణకు శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం ఈ నెల 11 వరకు కొనసాగించనుంది. వారోత్సవాల్లో భాగంగా రోజుకు ఒక కార్యక్రమం చొప్పున చేపట్టనున్నారు. ఇందులో భాగంగా తొలిరోజున ఫుడ్ సేఫ్టీ–ఈట్ రైట్ దినోత్సవం నిర్వహించారు. అవగాహన కార్యక్రమంతో పాటు పీహెచ్సీల్లో వ్యక్తిగత పరిశుభ్రత, తీసుకోవాల్సిన ఆహారం గురించి వివరించారు. ఈ నెల 8న ఎయిడ్స్నివారణ దినోత్సవం సందర్భంగా ఎయిడ్స్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించనున్నారు. 9న సురక్షిత మాతృ దినోత్సవం, 10న హోమియోపతి, ఆయూష్ దినోత్సవం సందర్భంగా స్వస్థత కేంద్రాల్లో యోగాసనాలు, చేయించడం, యోగ పాత్రను వివరింసాస్తరు. 11న మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మాదక ద్రవ్యాలు తీసుకోవడం ద్వారా కలిగే నష్టాల గురించి కళాశాలల్లో అవగాహన కల్పించనున్నారు.
గోదాముల తనిఖీ
మోత్కూరు : మోత్కూరు మండల కేంద్రంలోని సివిల్ సప్లయ్ బియ్యం గోదాం, పాటిమట్ల గ్రామంలోని ధాన్యం గోదాములను మంగళవారం జిల్లా సివిల్ సప్లయ్ అధికారి హరికృష్ణ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోదాములో ఉన్న బియ్యం, ధాన్యం నిల్వలను పరిశీలించారు. హమాలీలకు తగిన సలహాలు, సూచనలు చేశారు. మూడు నెలలకు సంబంధించి ఒకేసారి రేషన్ బియ్యం లబ్ధిదారులకు ప్రభుత్వం అందజేస్తున్నందున అధికారులు, డీలర్లు, హమాలీలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా చూడాలన్నారు. ఆయన వెంట గోదాం కంప్యూటర్ ఆపరేటర్ బాలాజీ తదితరులున్నారు.


