భువనగిరిటౌన్ : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావా ణిలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డితో కలిసి ప్రజల నుంచి వచ్చిన 57 అర్జీలను స్వీకరించారు. ప్రజావాణి దరఖాస్తులను సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ, జెడ్పీ సీఈఓ శోభారాణి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి పాల్గొన్నారు.
హెల్త్ వీక్ను విజయవంతం చేయాలి
సాక్షి,యాదాద్రి : ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం ‘ఫుడ్ సేఫ్టీ ఫోకస్ డే’ నిర్వహించినట్లు కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. కలెక్టరేట్లో ఫుడ్ సేఫ్టీ డిజిగ్నేటెడ్ ఆఫీసర్ స్వాతి ఆధ్వర్యంలో బీసీ, ఎస్టీ సంక్షేమ హాస్టళ్ల వంట సిబ్బంది, వార్డెన్లు, అంగన్వాడీ టీచర్లకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందించాలన్నారు. ఎయిమ్స్ బీబీనగర్, స్వర్ణగిరి దేవస్థానం ఫుడ్ హ్యాండ్లర్లకు కలెక్టర్ శిక్షణ సర్టిఫికెట్లు అందజేశారు.


