ఫ రామన్నపేట ప్రభుత్వ జూనియర్
కాలేజీకి మహర్దశ
ఫ రూ.19 లక్షలతో అభివృద్ధి పనులు
ఫ అత్యాధునిక వసతులు..
డిజిటల్ బోధన
ఫ విద్యార్థులకు ఆహ్లాదం
పంచనున్న విద్యాలయం
రామన్నపేట : విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ.. ఉత్తమ ఫలితాలతో జిల్లాలోనే అగ్రగామిగా నిలుస్తోంది రామన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల. నాలుగైదేళ్లుగా పెద్ద ఎత్తున విద్యార్థుల చేరికతో పాటు, విద్యా ప్రమాణాల్లో తన ప్రత్యేకతను చాటుకుంటున్న కళాశాలకు ఇటీవల ఇంటర్ బోర్డు నుంచి రూ.19 లక్షల నిధులు మంజూరయ్యాయి. జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో కళాశాలలోని అన్ని బ్లాకులకు రంగులు వేయించారు. మినరల్ గ్రాంట్ నిధులను వినియోగించి నూతనంగా ప్రహరీ నిర్మాణం, ఆకర్షణీయమైన ప్రధాన ద్వారం ఏర్పాటు, కళాశాల ఆవరణలో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టారు. దీంతో కళాశాల సర్వాంగ సుందరంగా మారింది. కళాశాల ఇప్పుడు నూతన శోభను సంతరించుకొని, వచ్చే విద్యాసంవత్సరంలో విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు సిద్ధంగా ఉంది.
విద్యార్థులకు డిజిటల్ తరగతులు
మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులకు మెరుగైన బోధన అందించేందుకు కళాశాల సిద్ధమైంది. వచ్చే విద్యా సంవత్సరం నుండి డిజిటల్ తరగతులు నిర్వహించేందుకు వీలుగా ప్రత్యేక డిజిటల్ ప్యానెళ్లను ఏర్పాటు చేశారు.
కోర్సుల వివరాలు
ప్రస్తుతం ఈ కళాశాలలో విద్యార్థుల కోసం నాలుగు జనరల్ గ్రూపులతో పాటు, ఉపాధి అవకాశాలు కల్పించే ఆరు ఒకేషనల్ కోర్సుల్లో విద్యాబోధన జరుగుతోంది. ఫలితాల్లో జిల్లాలోనే మేటిగా నిలుస్తుండటంతో స్థానిక విద్యార్థులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా ఇక్కడ చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు.


