యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. ఉదయాన్నే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతసేవ నిర్వహించారు. అనంతరం స్వయంభూలకు నిజాభిషేకం, బిందె తీర్థం, ఆరాధన, అర్చనలు, విశేష పూజలు చేపట్టారు. ఇక ముఖ మండపంలోని ఉత్సవమూర్తులకు సువర్ణ పుష్పార్చన నిర్వహించారు. ఇక ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం చేపట్టారు. సాయంత్రం వేళ ఆలయంలో జోడు సేవను ఊరేగించారు. రాత్రి శయనోత్సవం నిర్వహించి ఆలయాన్ని ద్వార బంధనం చేశారు.
సిద్ధాంతం కలిగిన పార్టీలకే ఆదరణ
మోత్కూరు : సైద్ధాంతిక సిద్ధాంతం కలిగిన పార్టీలనే ప్రజలు ఆదరిస్తారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూళ్ల వీరేందర్ గౌడ్ అన్నారు. ఆదివారం మోత్కూరులో పండిట్ దీన్దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్ ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. బూత్ స్థాయి నుంచి బలోపేతం చేసినప్పుడే తెలంగాణలో పార్టీ అధికారంలోకి రాగలుగుతుందన్నారు. అందుకోసం ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పని చేయాలన్నారు. బీజేపీ మున్సిపల్ శాఖ అధ్యక్షురాలు చాడ మంజులరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి వంగవీటి శ్రీనివాసరావు, ప్రశిక్షణ ప్రభారి గౌరు శ్రీనివాస్, మండల అధ్యక్షుడు గూదె మధుసూదన్, నాయకులు కె.నాగార్జున్రెడ్డి, బయ్యని చంద్రశేఖర్, ఏనుగు జితేందర్రెడ్డి, పోచం సోమయ్య, సజ్జనం మనోహర్, చేకూరి మల్లేశం, కూరాకుల వెంకన్న, సైదులు, ఏనుగు జితేందర్రెడ్డి, సజ్జనం మనోహర్, రమణ, సోమేశ్వరి, రేణుక, రాము, ధనలక్ష్మి పాల్గొన్నారు.
మట్టపల్లిలో నిత్యకల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఆదివారం లక్ష్మీనరసింహస్వామికి అర్చకులు ప్రత్యేక పూజలు విశేషంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లకు అభిషేకాలు, హోమశాలలో నిత్యహోమం జరిపించారు. అనంతరం నిత్య కల్యాణం నిర్వహించారు. కార్యక్రమంలో ధర్మకర్తలు, అర్చకులు పాల్గొన్నారు.


